కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా.. కారణం ఏంటంటే..?

కర్ణాటకలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ హైకమాండ్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. తనకు కేటాయించిన ఇరిగేషన్ శాఖపై తీవ్ర అసంతృప్తితో సీనియర్ మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గతంలో డీకే శివకుమార్ ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కారని, వరుసగా 8 సార్లు గెలిచిన తనను అవమానించారని ఆయన మండిపడ్డారు.

కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా.. కారణం ఏంటంటే..?
Minister Ramalinga Reddy Resigns 2 Days After Oath

Updated on: Jun 05, 2026 | 10:09 AM

కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం స్టార్ట్ అయ్యింది. మంత్రివర్గంలో శాఖల కేటాయింపు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. బుధవారం రోజే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. కేవలం రెండు రోజులు తిరక్కుండానే శుక్రవారం తన రాజీనామా లేఖను సమర్పించడం కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తితో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య కేబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన రామలింగారెడ్డి.. డీకే శివకుమార్ కేబినెట్‌లో బెంగళూరు నగరాభివృద్ధి శాఖను ఆశించారు. అయితే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనకు ఇరిగేషన్ శాఖ కేటాయించారు. తనకు డీకే బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కేటాయిస్తామని హామీ చెప్పారని.. ఇచ్చిన మాట తప్పడంతో మంత్రి పదవికి రాజీనామా చేస్తునట్లు రామలింగారెడ్డి ప్రకటించారు.

తనను పదే పదే అవమానించడం సరికాదని రామలింగారెడ్డి అన్నారు. ‘‘నేను వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. వీరప్ప మొయిలీ మంత్రివర్గంలో తొలిసారిగా మంత్రిగా పనిచేశాను. ఆ తర్వాత, సిద్దరామయ్య మంత్రివర్గంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశాను. గతంలో నాకు అప్పగించిన అన్ని శాఖలను చాలా సమర్థవంతంగా నిర్వహించిన చరిత్ర నాకు ఉంది. నన్ను మంత్రిని చేయమని గానీ, నాకు అలాంటి శాఖ కావాలని గానీ నేను ఏ ముఖ్యమంత్రినీ ఎప్పుడూ అడగలేదు. ఈసారి కూడా, నేను సీఎం శివకుమార్‌, హైకమాండ్‌ను మంత్రి పదవిని డిమాండ్ చేయలేదు. అయితే గతంలో డీకే శివకుమార్.. నేను రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి అవుతాను, ఆ సమయంలో నా దగ్గర ఉన్న బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖను మీకు ఇస్తాను అని వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు నాకు ఇరిగేషన్ శాఖను ఇచ్చారు’’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

బెంగళూరు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రామలింగారెడ్డి లాంటి సీనియర్ నేత అలక.. పార్టీకి భారీ నష్టం చేకూరుస్తుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్షోభం తెరపైకి రాగానే సీఎం డీకే శివకుమార్ మాజీ సీఎం సిద్ధరామయ్యతో అత్యవసరంగా భేటీ అయ్యారు. శాఖల కేటాయింపుపై సిద్ధరామయ్య సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హోం శాఖ కోసం ప్రియాంక్ ఖర్గే లాంటి నేతలు కూడా పట్టుబడుతుండటంతో కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం మరింత ముదిరేలా కనిపిస్తోంది. బెంగళూరు లాంటి కీలక ప్రాంతంలో బలమైన నేతగా ఉన్న రామలింగారెడ్డి అసంతృప్తి.. రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఒకరిని బుజ్జగిస్తే మరొకరు అలకపాన్పు ఎక్కుతుండటంతో అధిష్టానానికి కూడా ఇది పెద్ద తలనొప్పిగా మారింది.

Follow Us