
బతుకు తెరువు కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఓ వ్యక్తి ఏళ్ల తరబడి తన కుటుంబానికి దూరమయ్యాడు. చివరికి 22 ఏళ్ల తర్వాత అతని పరిస్థితులే ఇంటికి చేర్చాయి. వివరాల్లోకి వెళ్తే బిహార్ రాష్ట్రంలోని దర్భంగా జిల్లా బిచ్చౌలి గ్రామానికి చెందిన రమాకాంత్ ఝా అనే వ్యక్తికి ఇంటి దగ్గర ఎలాంటి పని దొరకలేదు. దీంతో భార్య, మూడేళ్ల కుమారుడ్ని వదిలేసి రైలులో హర్యాణాకు బయలుదేరాడు. అంబాలా స్టేషన్ లో రైలు ఆగింది. నీళ్ల బాటిలు కొనడానికి రమాకాంత్ రైలు దిగాడు. ఆ బాటిల్ కొనుక్కోని రైలు ఎక్కేలోపే అది వెళ్లిపోయింది. దీంతో ఇంటికి ఎలా వెళ్లాలో రమాకాంత్ కు తెలియలేదు. అలానే ఆకలితో తిరిగేవాడు. రోడ్డు పక్కన దొరికింది తింటూ కాలం వెల్లదీశాడు.
అయితే రమాకాంత్ ఏమయ్యాడో తెలియని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు ప్రాంతాల్లోనూ గాలించారు. ఓసారి రమాకాంత్ వీధుల్లో తిరుగుతుండగా.. కర్నాల్ లో ఉండే ఆషియానా అనే స్వచ్ఛంద సంస్థ డైరెక్టరు రాజ్కుమార్ అరోరాకి కనిపించాడు. ఆయన తన ఇంటికి తీసుకెళ్లి.. మంచి ఆహారం, వైద్యం అందించారు. రెండు నెలల తర్వాత రమాకాంత్కు తన గతం గుర్తొచ్చింది. దర్భంగా జిల్లా ఎస్పీకి రాజ్కుమార్ ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపాడు. 22 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత బుధవారం తన కుటుంబాన్ని రమాకాంత్ కలుసుకొన్నాడు. మూడేళ్ల బాలుడిగా తాను చూసిన కొడుకుని ఇప్పుడు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువకుడిగా చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..