దేశంలో ఎన్నికలు సమీపిస్తు్న్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో మార్చి 4-6 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఆదిలాబాద్లో మార్చి 4వ తేదీన ఉదయం 10:30 గంటలకు రూ.56,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు.
అలాగే హైదరాబాద్లోని పౌర విమానయాన పరిశోధన సంస్థ కేంద్రాన్ని మార్చి 5వ తేదీ ఉదయం 10 గంటలకు జాతికి అంకితం చేయనున్నారు. అదే రోజు సంగారెడ్డిలో రూ 6,800 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. సంగారెడ్డిలో చేపట్టిన ప్రాజెక్టులు రోడ్డు, రైలు, పెట్రోలియం, సహజ వాయువు వంటి బహుళ కీలక రంగాలను కలిగి ఉన్నాయి. హైదరాబాద్లో దేశ పౌర విమానయాన పరిశోధనా సంస్థని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే ఘట్కేసర్ – లింగంపల్లి నుండి మౌలా అలీ – సనత్నగర్ ఎంఎంటీఎస్ రైలు సర్వీస్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు సేవ హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగర ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన సబర్బన్ రైలు సేవను మొదటిసారిగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఇక ఇక్కడి నుంచి ఒడిశాకు బయలుదేరి మధ్యాహ్నం 3:30 గంటలకు జాజ్పూర్లోని చండీఖోలేలో రూ.19,600 కోట్లు విలువైన బహుళ కనెక్టివిటీ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.
కోల్కతాలో మార్చి 6వ తేదీన ఉదయం 10:15 గంటలకు 15,400 కోట్ల విలువైన బహుళ కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత, మధ్యాహ్నం 3:30 గంటలకు దాదాపు రూ.కోటి విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అలాగే బీహార్లోని బెట్టియాలో 12,800 కోట్లు విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
ఇదిలా ఉండగా, ఆదిలాబాద్లో ప్రారంభించే అభివృద్ధి పనుల్లో 56,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన విద్యుత్, రైలు, రోడ్డు రంగానికి సంబంధించిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లిలో ఎన్టీపీసీ 800 మెగావాట్ల (యూనిట్-2) తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేయనున్నారు. అల్ట్రా-సూపర్క్రిటికల్ టెక్నాలజీ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ తెలంగాణకు 85% విద్యుత్ను సరఫరా చేస్తుంది. అలాగే భారత్లోని ఎన్టీపీసీ అన్ని పవర్ స్టేషన్లలో దాదాపు 42% అత్యధిక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ప్రధాని షెడ్యూల్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి