Fastest Metro: గుడ్న్యూస్.. అందుబాటులోకి దేశంలోనే తొలి హై స్పీడ్ మెట్రో ట్రైన్! రేపే ప్రారంభం!
PM Modi Meerut Visit: ఆదివారం యూపీలోని మీరట్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 12,930 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఇందులో ఢిల్లీ-మీరట్ నమో భారత్ RRTS కారిడార్, మీరట్ మెట్రో కీలకమైనవి. గంటకు 120 కి.మీ వేగంతో నడిచే ఈ మెట్రో, దేశంలోనే అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థగా మారనుంది. ఆధునిక, సుస్థిర ప్రజా రవాణా ద్వారా పట్టణ ట్రాఫిక్ను తగ్గించి, పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశ్యం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12:30 గంటలకు, శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్లో మెట్రో సేవలను ఆయన ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు ఆయన మెట్రోలో ప్రయాణం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు, మీరట్లో దాదాపు రూ.12,930 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు.
82 కిలోమీటర్ల ఢిల్లీ-మీరట్ నమో భారత్ కారిడార్
మీరట్ మెట్రో దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో వ్యవస్థగా ఉండనుంది. దీని గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. ఈ మెట్రో మొత్తం ప్రాంతాన్ని కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. 82 కిలోమీటర్ల ఢిల్లీ-మీరట్ నమో భారత్ కారిడార్ను ప్రధాని మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు. భారత తొలి నమో భారత్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్)లోని మిగిలిన సెక్షన్లనూ మోదీ ప్రారంభిస్తారు. ఇందులో ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్, న్యూ అశోక్ నగర్ మధ్య 5 కిలోమీటర్ల సెక్షన్, ఉత్తరప్రదేశ్లోని మీరట్ సౌత్, మోదీపురం మధ్య 21 కిలోమీటర్ల సెక్షన్లు ఉన్నాయి.
గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా భారత తొలి నమో భారత్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థను రూపొందించారు. ఇది సాహిబాబాద్, ఘజియాబాద్, మోదీనగర్, మీరట్ వంటి ప్రధాన కేంద్రాలను వేగవంతమైన వ్యవస్థ ద్వారా ఢిల్లీతో అనుసంధానిస్తుంది. ఈ కారిడార్ ప్రారంభ స్టేషన్ సరాయ్ కాలే ఖాన్గా ఉంది. నాలుగు నమో భారత్ స్టేషన్లలో ఇది ఒకటి. ఇది వ్యూహాత్మకంగా ఒక ప్రధాన మల్టీ-మోడల్ హబ్గా ఉంది. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, ఢిల్లీ మెట్రో పింక్ లైన్, వీర్ హకీకత్ రాయ్ ఐఎస్బీటీ, రింగ్ రోడ్లను ఇది అనుసంధానిస్తుంది.
మీరట్ సౌత్-మోదీపురం మధ్య మీరట్ మెట్రో రైలు సేవలనూ మోదీ ప్రారంభిస్తారు. నమో భారత్, మీరట్ మెట్రోలను ఒకే మౌలిక సదుపాయాలతో అనుసంధానించడం వల్ల హై-స్పీడ్ ఇంటర్సిటీ ప్రయాణం, వేగవంతమైన ఇంట్రా-సిటీ రవాణా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. దేశంలో పట్టణ, ప్రాంతీయ సమీకృత రవాణాలో సరికొత్త ప్రమాణాలను ఇది నిర్దేశిస్తుంది.
ఈ మెట్రో అందుబాటులోకి రావడం వల్ల రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గుతుంది తద్వారా వాహనాల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచే, పట్టణ రవాణా వ్యవస్థను మలుపుతిప్పే ప్రాజెక్టుగా మారనుంది. సజావైన, సమర్థమైన, ఆధునిక, సుస్థిర ప్రజా రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేయాలనే ప్రధానమంత్రి దార్శనికతకు ఈ ప్రాజెక్టులు మరింత ఊతం ఇవ్వనున్నాయి.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
