New Parliament: ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న నేల భారత్.. నూతన పార్లమెంట్లో ప్రధాని తొలి ప్రసంగం ఇదే..
ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న నేల భారత్.. దేశాభివృద్ధితో ప్రపంచ వృద్ధి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. త్వరలో ఎంపీ స్థానాలు పెరుగుతాయని.. కొత్త పార్లమెంట్ అవసరంపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశ ప్రగతిలో కొన్ని అంశాలు అజరామరంగా నిలుస్తాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సనాతన ధర్మం ఉట్టిపడేలా, అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్బంగా నూతన పార్లమెంట్ భవనంలో తొలి ప్రసంగం చేశారు ప్రధాని మోదీ. ఆయన మాట్లాడుతూ.. మే 28 కూడా చరిత్రకు ఒక సాక్ష్యంగా నిలుస్తుందన్నారు ప్రధాని మోదీ. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు.. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అని ప్రధాని మోదీ అభివర్ణించారు. స్వాతంత్ర్య వీరుల కలల సాకారానికి కొత్త భవనం వేదికగా నిలుస్తుందన్నారు. భారత్ కొత్త లక్ష్యాలను ఎంచుకుందన్నారు. కొత్త ఆశలు.. కొంగొత్త లక్ష్యాలతో దేశం పురోగమిస్తోందన్నారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు ఆశగా చూస్తోందన్నారు. కొద్దిసేపటి క్రితమే పవిత్ర సెంగోల్ను ప్రతిష్టించుకున్నామని అన్నారు. కర్తవ్యం, సేవలకు సెంగోల్ ప్రతీక అని అన్నారు.
సెంగోల్ గురించి మీడియాలో అనేక కథనాలు వచ్చాయని.. మీడియా కథనాల ద్వారా సెంగోల్ గౌరవం పెరిగిందన్నారు. భారత్ ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి జనని అన్నారు. ఎక్కడైనా ఆగిపోతే అభివృద్ధి అక్కడే ఆగిపోతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ముందుకెళ్తూనే ఉండాలన్నారు. ఆజాదీకా అమృతకాలం.. దేశానికి కొత్త దిశను నిర్దేశించే కాలం అని తెలిపారు.
కొత్త భారతావనికి ఆజాదీకా అమృతకాలం మార్గం కావాలన్నారు. 21వ శతాబ్దంలో భారత్ ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకుందన్నారు. దేశం బానిస వాసనలను వదిలిపెట్టి ముందుకెళ్తోందని.. పాత పార్లమెంట్ భవనంలో అనేక ఇక్కట్లు ఎదురయ్యేవి.. కనీసం కూర్చోవడానికే కాదు.. సాంకేతికంగానూ అనేక సమస్యలు వచ్చేవని గుర్తు చేసుకున్నారు ప్రధని మోదీ.
రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుందన్నారు ప్రధాని మోదీ. దానికి తగ్గట్టుగానే ఆధునిక వసతులతో కొత్త భవనం నిర్మించామనని చెప్పుకొచ్చారు. 9 ఏళ్లుగా నవ నిర్మాణం, పేదల సంక్షేమం కోసం కృషి చేశామని.. 9 ఏళ్లలో గ్రామాలను కలుపుతు 4 లక్షల కి.మీ. రోడ్లు వేశమని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం