PM Modi: కూలిన టన్నెల్‌లో 41 మంది కార్మికులు.. రెస్క్యూ పనులపై ప్రధాని మోడీ ఆరా

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్‌ధామ్‍‌లలో ఒకటైన యమునోత్రి చేరుకునే జాతీయ రహాదారిపై ఈ టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. పూర్తిగా హిమాలయాల్లో కొలువైన ఈ జాతీయ రహదారిలో ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు బ్రహ్మకాల్ - యమునోత్రి మధ్య టన్నెల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సిల్క్యారా - దండల్‌గావ్‌ మధ్య నిర్మాణంలో ఉన్న ఈ టన్నెల్‌ నవంబర్ 12న ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

PM Modi: కూలిన టన్నెల్‌లో 41 మంది కార్మికులు.. రెస్క్యూ పనులపై ప్రధాని మోడీ ఆరా
PM Narendra Modi
Follow us

| Edited By: Basha Shek

Updated on: Nov 20, 2023 | 10:40 AM

జాతీయ రహదారిలో భాగంగా నిర్మిస్తున్న ఓ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు సంస్థలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. వారం రోజులకు పైగా టన్నెల్‌లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న కార్మికులకు నీటితో పాటు ఆహారాన్ని సహాయ బృందాలు అందించగల్గుతున్నాయి. కానీ వారిని బయటకు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్‌ధామ్‍‌లలో ఒకటైన యమునోత్రి చేరుకునే జాతీయ రహాదారిపై ఈ టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. పూర్తిగా హిమాలయాల్లో కొలువైన ఈ జాతీయ రహదారిలో ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు బ్రహ్మకాల్ – యమునోత్రి మధ్య టన్నెల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సిల్క్యారా – దండల్‌గావ్‌ మధ్య నిర్మాణంలో ఉన్న ఈ టన్నెల్‌ నవంబర్ 12న ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్మాణ పనుల్లో ఉన్న 41 మంది కార్మికులు టన్నెల్ లోపలి భాగంలో చిక్కుకుపోయారు. వారు బయటికొచ్చేందుకు మార్గం లేకుండా పోయింది. కార్మికులను రక్షించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ సహాయ బృందాలు రంగంలోకి దిగి తమ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

కార్మికులకు నీరు, ఆహారం

టన్నెల్ మధ్యలో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడాలంటే కుప్పకూలిన మార్గాన్ని క్లియర్ చేసుకుంటూ కార్మికులు ఉన్న ప్రదేశానికి చేరుకోవాలి. దీనికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు కార్మికుల ప్రాణాలు కాపాడాలంటే వారికి గాలి, నీరు, ఆహారం అందించాలి. టన్నెల్ నిర్మాణంలో కంప్రెషన్ కోసం ఏర్పాటు చేసిన 4 ఇంచుల పైప్‌లైన్ ఇప్పుడు వారి ప్రాణాలు తాత్కాలికంగా కాపాడుతోంది. ఆ పైప్ లైన్ ద్వారా నీరు, ఆహారం అందిస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు. అలాగే కార్మికులు ఉన్న ప్రదేశంలో విద్యుత్తు సరఫరా, నీటి సరఫరా ఉందని వెల్లడించారు. చిక్కుకున్న కార్మికులకు డ్రైఫ్రూట్స్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు, యాంటీ-డిప్రెషన్‌ మెడిసిన్ పంపే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఆహారం, మందులు అందించడం కోసం ప్రత్యేకంగా 6 ఇంచుల బోరింగ్ తవ్వుతున్నట్టు తెలిపారు. మొత్తం 60 మీటర్లలో ఇప్పటికే 39 మీటర్ల మేర తవ్వకం పూర్తయిందని.. ఇది పూర్తికాగానే మరింత అదనపు ఆహారం, మందులు అందిస్తామని తెలిపారు. అదే సమయంలో లోపల చిక్కుకున్న కార్మికులకు మనోధైర్యాన్ని అందించేందుకు తరచుగా వారితో మాట్లాడుతున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. మానసిక ఆందోళనతో పాటు టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులకు స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తినట్టు తెలిసింది.

రెస్క్యూ పనులపై ప్రధాని ఆరా

ఉత్తరకాశీ టన్నెల్ దుర్ఘటనపై ప్రధాని కార్యాలయం స్వయంగా రంగంలోకి దిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహాయాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసి కార్మికుల యోగక్షేమాల గురించి ఆరా తీశారు. అలాగే కొనసాగుతున్న సహాయ చర్యల గురించి కూడా వివరాలు అడిగి తెలసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం అవసరమైన యంత్ర సామిగ్రితో పాటు సిబ్బంది, ఇతర వనరులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోందని ప్రధాని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సమన్వయంతో సహాయ చర్యలు మరింత వేగవంతం చేయాలని సూచించారు. సహాయక చర్యల్లో అన్ని ఏజెన్సీలు నిమగ్నమై ఉన్నాయని పుష్కర్ సింగ్ ధామీ ప్రధానికి తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా ఉన్నారని, ఆక్సిజన్, పౌష్టికాహారం, నీరు అందిస్తున్నామన్నారు. నిపుణుల సూచనలతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తాను స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నానని వెల్లడించారు. వైద్యబృందాలను సైతం అక్కడ సిద్ధంగా ఉంచామని చెప్పారు. ఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రధాన మంత్రి మూడు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..