PM Modi: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం.. ప్రధాని మోదీ అత్యవసర మీటింగ్.. వాటిపై కీలక చర్చ..

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం భీకర రూపం దాల్చడంతో పశ్చిమాసియా అతలాకుతలం అవుతోంది. ఈ ఉధృత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి అత్యున్నత స్థాయి భద్రతా కేబినెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయుల భద్రత, వారి సురక్షిత తరలింపు, విమాన సేవల నిలిపివేత, చమురు సరఫరాపై పడే ప్రభావంపై ప్రధానంగా చర్చించారు.

PM Modi: ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం.. ప్రధాని మోదీ అత్యవసర మీటింగ్.. వాటిపై కీలక చర్చ..
Pm Modi Chairs Ccs Meeting

Updated on: Mar 02, 2026 | 8:21 AM

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమాసియా మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి భద్రతా కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్న కాసేపటికే ప్రధాని మోదీ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో దేశ భద్రత, వ్యూహాత్మక విషయాలపై ప్రధానంగా చర్చించారు. పశ్చిమాసియాలో నివసిస్తున్న సుమారు 9 మిలియన్ల మంది భారతీయుల భద్రతపై CCS ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా ఇజ్రాయెల్‌లోని 40,000 మంది, ఇరాన్‌లోని 10,000 మంది భారతీయుల పరిస్థితిని సమీక్షించారు.

యుద్ధ ఉద్రిక్తతల వల్ల విమాన సేవలు నిలిచిపోయి, దుబాయ్ వంటి విమానాశ్రయాలలో చిక్కుకుపోయిన వందలాది మంది భారతీయులను సురక్షితంగా తరలించే అంశంపై చర్చించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో తలెత్తిన తాజా పరిస్థితులను ఉన్నతాధికారులు కమిటీకి వివరించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు.

చమురు సరఫరాపై ఆందోళన

భారత చమురు వాహక సంస్థలకు ప్రధాన మార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రమాదంపై కూడా కమిటీ చర్చించింది. పశ్చిమాసియాలోని భారత రాయబార కార్యాలయాలు స్థానిక భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని, హెల్ప్‌లైన్‌లను అందుబాటులో ఉంచామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మునుపటి ఘర్షణల సమయంలో మాదిరిగానే, ఈసారి కూడా భారతీయులను సురక్షితంగా తరలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వర్గాలు తెలిపాయి.

Follow Us