AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pariksha Pe Charcha 2026: ‘క్రమశిక్షణ లేకపోతే ఎంత స్ఫూర్తి ఉన్నా సత్ఫలితం దక్కదు’.. విద్యార్ధులకు ప్రధాని మోదీ సలహాలు

Pariksha Pe Charcha 2026 Episode 2: 'పరీక్షా పే చర్చ 2026’ రెండో ఎడిషన్‌లో భాగంగా పలువురు విద్యార్థులతో ప్రధాని సోమవారం ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానలు ఇచ్చారు. అలాగే విద్యార్థుల సందేహాలకు పలు సూచనలు చేశారు.

Pariksha Pe Charcha 2026: 'క్రమశిక్షణ లేకపోతే ఎంత స్ఫూర్తి ఉన్నా సత్ఫలితం దక్కదు'.. విద్యార్ధులకు ప్రధాని మోదీ సలహాలు
Modi Interation With Students In Pariksha Pe Charcha
Srilakshmi C
|

Updated on: Feb 09, 2026 | 11:28 AM

Share

దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘పరీక్ష పే చర్చ’ 9వ ఎడిషన్‌ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండవ సెషన్‌ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో మోదీ తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ విద్యార్థులతో సంభాషించారు. ఇందులో స్టార్టప్‌ల నుంచి పరీక్షల ప్రిపరేషన్‌, ఒత్తిడి, సవాళ్లు వంటి పలు విషయాలపై విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారు.

మంచి నాయకుడిగా ఎలా మారాలి?

మీరు ముందు నాయకుడిగా మారాలి. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఆపై దాన్ని ఆచరణలో పెట్టాలి. ఉదాహరణకు మీరు వీధిలో చెత్తను తొలగిస్తే, ప్రజలు మిమ్మల్ని అనుసరిస్తారు. నాయకుడిగా ఉండటం అంటే ఎన్నికల్లో పోటీ చేయడం కాదు. నాయకుడిగా ఉండటం అంటే కొంతమందిని ఒప్పించగలగడం. అందుకే మీరు మొదట దానిని అర్థం చేసుకోవాలి. విధేయత, నిబద్ధతతో పనిచేయాలి. నిలకడగా సరైన పని చేయడమే నిజమైన నాయకత్వం. లీడర్‌షిప్‌కు ముఖ్యమైన లక్షణం మీ ఆలోచనలను కనీసం 10 మందికైనా స్పష్టంగా తెలియజేయగలగడం అని మోదీ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఏఐకి భయపడాలా?

ప్రతి యుగంలోనూ కొత్త సాంకేతికత వచ్చినప్పుడు ఇలాంటి చర్చలు తలెత్తుతాయి. మనం దాని గురించి భయపడకూడదు. దాని బానిసలుగా మారకుండా ఉండటానికి మనం కృషి చేయాలి. దానిని మన యజమానులుగా మారనివ్వ కూడదు. అలాగే మీరు దానికి బానిసలుగా మారకుండా చూసుకోవాలి. కంప్యూటీర్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి చర్చే జరిగింది. పిల్లలు మొబైల్‌కు బానిసలవుతున్నారు. ఫోన్ లేకపోతే కనీసం తినడం లేదని కూడా విన్నాను. ఈ పద్ధతి మారాలి. ఎవరూ మొబైల్‌కు బానిసలు కాకుండా చూసుకోవాలి. అలాగే  ఉద్యోగాల స్వభావం మారుతూనే ఉంటుంది. కాబట్టి సాంకేతికతను అర్థం చేసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. ఏఐకి మనం భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.

జీవితంలో క్రమశిక్షణ ఎందుకు?

జీవితంలో ప్రేరణతో పాటు క్రమశిక్షణ కూడా అవసరమని అన్నారు. క్రమశిక్షణ లేకపోతే ఎంత ప్రేరణ వచ్చినా పనిచేయదు. పక్కన ఉన్న రైతును చూసి ప్రేరణ పొంది అధికంగా సంపాదిస్తున్న రైతును ఊహించుకోవాలి. అటువంటి పరిస్థితిలో అంత సంపాదించడానికి ప్రేరణ లభిస్తుంది. కానీ క్రమశిక్షణ లేకుండా, ప్రేరణ పనిచేయదు. అప్పుడు అది భారంగా మారుతుంది. నిరాశను సృష్టిస్తుందని మోదీ సమాధానం ఇచ్చారు.

స్టార్టప్‌ ఎలా ప్రారంభించాలి?

ప్రధాని మోదీ, మీరు ఒక చిన్న స్టార్టప్‌తో ప్రారంభించవచ్చని అన్నారు. అందుకు 25 ఏళ్లు ఉండవల్సిన అవసరం లేదన్నారు. ఎప్పుడైనా ప్రారంభింవచ్చని అన్నారు. మీ చదువు, మీ కెరీర్ రెండింటినీ కొనసాగించాలనుకుంటే ప్రతి వారం మీ కెరీర్‌కు కొంత సమయం కేటాయించడం ప్రారంభించాలని మోదీ అన్నారు. ఇది రెండు పనులను సమతుల్యం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. కొన్ని స్టార్టప్‌లు టెక్నాలజీపై దృష్టి పెడతాయి. మీకు వివిధ రంగాలలో నిపుణులైన స్నేహితులు ఉంటే వారితో కలిసి చిన్న స్టార్టప్‌ను ప్రారంభించవచ్చని ప్రధాని మోదీ అన్నారు.

మీ జీవితంలో గురువు పాత్ర ఏమిటి?

మా ఉపాధ్యాయులు మమ్మల్ని లైబ్రరీకి వెళ్లమని ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి యోగా సాధన చేయమని ప్రోత్సహించారు. ఇలా ప్రతి ఉపాధ్యాయుడు ఏదో ఒక విధంగా దోహదపడతాడని ప్రధాని మోదీ అన్నారు. పరీక్షలపై జరిగిన చర్చ సందర్భంగా గుజరాత్‌లోని పాల్టారియా సమాజానికి తాను చేసిన కృషిని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఒత్తిడిని నివారించడానికి పిల్లలు మంచి నిద్ర పొందాలని ఆయన సూచించారు. వారి కలలను సాధించడానికి కష్టపడి పనిచేయాలని కూడా ఆయన కోరారు.

చదువు, క్రీడల మధ్య సమతుల్యత ఎలా కాపాడాలి?

విద్య అన్నింటికీ పరిష్కారం చూపదు. అందుకే క్రీడలు కూడా ఆడాలి. జీవితం ఒక ఆటగా మారకుండా ఉండాలంటే మీరు ఆడాలని ఆయన అన్నారు.

ఈ సెషన్‌లో తమిళనాడుతో పాటు రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పిల్లలతో కూడా మాట్లాడారు. విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సెషన్‌లో విద్యార్ధులు తమ నగరాల్లోని వివిధ ప్రదేశాలను సందర్శించాలని మోదీని కోరారు. పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండటం, దినచర్యను అనుసరించడం, తమపై నమ్మకం ఉంచడం గురించి ఆచరణాత్మక చిట్కాలను ప్రధాని మోదీ పంచుకుంటారు. పరీక్షల ఒత్తిడి నిర్వహణ, సమయ మేనేజ్మెంట్, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం, సానుకూల మైండ్‌సెట్, టెక్నాలజీ ఉపయోగం వంటి అంశాలపై విద్యార్ధులకు ప్రధాని మోదీ సూచనలు ఇచ్చారు.

కాగా 2018 నుంచి ప్రధానమంత్రి మోదీ ప్రతి యేట బోర్డు పరీక్షలకు ముందు విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చ’ (PPC) నిర్వహిస్తున్నారు. విద్యార్థులలో పరీక్ష ఒత్తిడిని తగ్గించడం, సమగ్ర విద్యను ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా పరీక్షా పే చర్చ కార్యక్రమం జరుగుతుంది. 2025 ఈవెంట్‌లో 50 మిలియన్లకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 2026 ఎడిషన్‌లో 45 మిలియన్లకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. అదనంగా మరో 22.6 మిలియన్ల మంది సంబంధిత కార్యకలాపాలలో చేరారు. దీనితో ఈసారి 67.6 మిలియన్లకు పైగా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, సానుకూలత, సమగ్ర శ్రేయస్సును పెంపొందించడం ద్వారా పరీక్షల సమయాన్ని ఉత్సవంగా జరుపుకోవడం లక్ష్యంగా ప్రధాని పరీక్షా పే చర్చ కార్యక్రమం జరుగుతుంది. పరీక్షా పే చర్చ 2026 మొదటి ఎపిసోడ్ ఫిబ్రవరి 6న జరిగింది. ఈ ఎపిసోడ్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలలో పరీక్షా పే చర్చ నిర్వహించాలని చాలా మంది విద్యార్థులు సూచించినట్లు ప్రధాని మోదీ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.