
జనవరి 1, 2026 నుంచి ట్రాఫిక్ నియమాలకు సంబంధించి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఒకే ఏడాదిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రోడ్డు భద్రతను మెరుగుపరచడం, అలవాటుగా నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు కట్టడి విధించడమే ఈ మార్పు లక్ష్యంగా కేంద్ర రవాణా శాఖ జాతీయ మోటారు వాహనాల నిబంధనల్లో సవరణ చేసింది.
అమలులోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం లైసెన్స్ను సస్పెండ్ చేయడం, రద్దు చేయడం సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) లేదా జిల్లా రవాణా కార్యాలయం (DTO) పరిధిలో ఉంటుంది. అయితే నేరుగా చర్యలు తీసుకునే ముందు, సంబంధిత లైసెన్స్దారుడికి తన వాదన వినిపించే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఐదు తప్పిదాల లెక్కింపు రోలింగ్ పద్ధతిలో ఉంటుంది. అంటే ఒక నిర్దిష్ట తేదీ నుంచి లెక్కించే ఏడాది వ్యవధిలో జరిగిన తప్పిదాలే పరిగణనలోకి వస్తాయి. గత ఏడాది ఉల్లంఘనలు తదుపరి ఏడాది లెక్కలోకి రావని కేంద్ర జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇంతకుముందు ఉన్న నిబంధనల ప్రకారం వాహన దొంగతనం, ప్రయాణికులపై దాడి, ప్రమాదకర వేగం, అధిక లోడ్, వాహనాన్ని రోడ్డుపై వదిలేయడం వంటి 24 తీవ్రమైన నేరాలు జరిగితేనే లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన ఐదు తప్పిదాల నిబంధనతో సాధారణంగా రోజూ జరిగే చిన్న ఉల్లంఘనలూ లెక్కలోకి వస్తాయి. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, సీట్బెల్ట్ ధరించకపోవడం, రెడ్ సిగ్నల్ జంప్ చేయడం వంటి సాధారణంగా పట్టించుకోని తప్పిదాలు రిపీట్ అయితే.. లైసెన్స్ రద్దుకు దారి తీస్తాయి. అందువల్ల వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఇకపై మరింత జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఏర్పడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..