శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.. ఈ కథ తెలిస్తే షాకే..
రక్షణ కల్పించాల్సిన ఖాకీ.. రాక్షసత్వానికి మారుపేరుగా మారితే.. చట్టాన్ని కాపాడాల్సిన చేతులే.. రక్తంతో తడిస్తే.. మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన ఒక దారుణ హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. భార్యపై ఉన్న అనుమానం.. ప్రాణ స్నేహితుడినే బలి తీసుకునేలా చేసింది. కేవలం చంపడమే కాదు, ఆధారాలు దొరకకుండా శవాన్ని ఏం చేశాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే దారి తప్పితే.. రక్షకుడే భక్షకుడిగా మారితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ కానిస్టేబుల్ తన స్నేహితుడిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. కేవలం చంపడమే కాకుండా ఎవరూ గుర్తుపట్టకుండా శవాన్ని 191 కిలోమీటర్ల దూరం కారులో తీసుకెళ్లి తగులబెట్టి బావిలో పడేసిన ఈ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నవీ ముంబైలోని రబాలే MIDC పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న బండు భిసే, కలంబోలిలోని రోడ్పాలిలో నివసించేవాడు. అక్కడే ఉండే సోమనాథ్ బాబ్డేతో అతనికి మంచి స్నేహం ఉంది. అయితే సోమనాథ్కు తన భార్యతో సంబంధం ఉందన్న అనుమానం బండు మనసులో బలపడింది. ఆ అనుమానమే ప్రతీకార జ్వాలగా మారి, సోమనాథ్ను అంతం చేయాలని పథకం వేశాడు. ఫిబ్రవరి 5న తన అనుచరులైన విజయ్ పవార్, కిరణ్ గైక్వాడ్, శ్రీనివాస్ లోన్ సహాయంతో సోమనాథ్ను పిలిపించి గొంతు కోసి దారుణంగా చంపేశాడు.
గుట్టు రట్టు చేసింది ఇలా..
తాను పోలీసు కావడంతో ఎక్కడా ఆధారాలు దొరకకూడదని భావించిన బండు.. మృతదేహాన్ని కారు ముందు సీటుపై కూర్చోబెట్టి ఏకంగా 191 కిలోమీటర్ల దూరంలో ఉన్న సతారా జిల్లా సుఖేద్ గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక వ్యవసాయ బావి వద్ద మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. మృతదేహం సగానికి పైగా కాలిన తర్వాత, దానిని బావిలోకి తోసి ఏమీ తెలియనట్టు తిరిగి ముంబై చేరుకున్నాడు. ఫిబ్రవరి 6న బావిలో కాలిన మృతదేహం లభించడంతో రంగంలోకి దిగిన లోనంద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలం నుండి ప్రధాన రహదారి వరకు ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. అందులో కనిపించిన ఒక అనుమానాస్పద కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా ఆ కారు పూణేకు చెందినదిగా తేలింది. ఆ కారు వెతుకుతు వెళ్లిన పోలీసులకు కానిస్టేబుల్ బండు భిసే అసలు రూపం బయటపడింది. మొదట నేరాన్ని అంగీకరించని బండు.. పోలీసులు అతని సహచరులను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు నిజం ఒప్పుకున్నాడు.
నిందితులు జైలు పాలు
పోలీసు సూపరింటెండెంట్ తుషార్ దోషి పర్యవేక్షణలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ శివాజీ జయపాత్రే బృందం అత్యంత చాకచక్యంగా ఈ కేసును ఛేదించింది. నేరానికి పాల్పడిన కానిస్టేబుల్ బండుతో పాటు అతని ముగ్గురు అనుచరులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
