పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్..! ఫోరెన్సిక్ రిపోర్ట్లో షాకింగ్ నిజాలు?
ముంబైలో ఇటీవల చోటుచేసుకున్న డోకాడియా కుటుంబం అనుమానాస్పద మృతి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు పుచ్చకాయ తిని మరణించడం వెనుక కేవలం ఫుడ్ పాయిజనింగ్ మాత్రమే లేదని, దాని వెనుక ఒక ప్రమాదకర రసాయనం ఉందని ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. ఈ మేరకు వీరిది ప్రమాదమా లేక పథకం ప్రకారం జరిగిన హత్యలా అన్న కోణంలో ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి.

ముంబైలో సంచలనం సృష్టించిన డోకాడియా కుటుంబం అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తొలుత ఫుడ్ పాయిజనింగ్గా భావించిన ఈ ఘటన ఇప్పుడు విషప్రయోగం అనుమానాల దిశగా మలుపు తిరిగింది. ఫోరెన్సిక్ నివేదికలో కుటుంబ సభ్యుల మరణాలకు కారణం ఫుడ్పాయిజన్ కాదని, ఎలుకలను చంపేందుకు ఉపయోగించే ప్రమాదకర రసాయనం జింక్ ఫాస్ఫైడ్ అని నిర్ధారణ కావడంతో పోలీసులు కేసును అత్యంత ప్రాధాన్యంతో దర్యాప్తు చేస్తున్నారు. ఏప్రిల్ 26 రాత్రి డోకాడియా కుటుంబ సభ్యులు ఇంట్లో పుచ్చకాయ తిన్న అనంతరం అస్వస్థతకు గురయ్యారు. కొద్ది గంటల్లోనే పరిస్థితి విషమించడంతో వారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనలో అబ్దుల్లా డోకాడియా, ఆయన భార్య నస్రీన్, కుమార్తెలు ఆయిషా, జైనబ్ మృతి చెందారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ప్రారంభంలో ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసు కావచ్చని పోలీసులు భావించారు. అయితే పోస్ట్మార్టం అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల కోసం సేకరించిన నమూనాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పుచ్చకాయ నమూనాలతో పాటు మృతుల శరీరాల్లో కూడా జింక్ ఫాస్ఫైడ్ ఆనవాళ్లు బయటపడినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ఈ రసాయనాన్ని ఎలుకలను చంపేందుకు ఉపయోగిస్తారు. ఇది అత్యంత విషపూరిత పదార్థంగా గుర్తించబడింది. ఈ నేపథ్యంలో పుచ్చకాయలోకి ఈ రసాయనం ఎలా చేరిందనే అంశంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. పుచ్చకాయ కొనుగోలు చేసిన ప్రదేశం, దాన్ని ఇంటికి తీసుకువచ్చిన పరిస్థితులు, కుటుంబ సభ్యులతో ఇటీవల ఎవరెవరు కలిశారు వంటి అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా విషం కలిపారా అనే అంశాలపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
అలాగే కుటుంబ సభ్యుల వ్యక్తిగత, వ్యాపార సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, ఇటీవల ఏర్పడిన వివాదాలపై కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. కుటుంబానికి సన్నిహితులు, పొరుగువారు, బంధువుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. అవసరమైతే సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ డేటా రికార్డులను కూడా పరిశీలించే అవకాశముందని సమాచారం. ఈ ఘటన ముంబైలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక కుటుంబం మొత్తంగా ప్రాణాలు కోల్పోవడం, దర్యాప్తులో విషప్రయోగం కోణం బయటపడటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక వెలుగులోకి రావడంతో కేసు మరింత మిస్టరీగా మారిందని, పూర్తి నిజాలు బయటపడేందుకు ఇంకా సమయం పట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.




