AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమానుషం.. మెడికల్‌ టీమ్‌పై దగ్గుతూ ‘హాట్‌స్పాట్’‌ ప్రజల దాడి

కరోనా నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య సిబ్బంది కష్టపడుతుంటే.. వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు కొందరు.

అమానుషం.. మెడికల్‌ టీమ్‌పై దగ్గుతూ 'హాట్‌స్పాట్'‌ ప్రజల దాడి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 11, 2020 | 5:16 PM

Share

కరోనా నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య సిబ్బంది కష్టపడుతుంటే.. వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. వైద్య సిబ్బందిపై దాడి చేయడం, అసభ్యంగా మాట్లాడటం వంటి పనులను చేస్తున్నారు. తాజాగా కరోనా శాంపిల్స్ కోసం వెళ్లిన మెడికల్ టీమ్‌పై హాట్‌ స్పాట్ ప్రజలు దాడి చేశారు. మాస్క్‌లు లేకుండా వచ్చి వారి మీద దగ్గారు. పరుషపదజాలంతో దూషించారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేసులు ఎక్కువగా ఉండటంతో తిరువనంతపురంలోని పూన్తురా గ్రామాన్ని హాట్‌స్పాట్‌గా మార్చారు అధికారులు.

ఈ క్రమంలో ప్రజల నుంచి శాంపిల్స్ తీసుకునేందుకు శుక్రవారం డాక్టర్ ద్యుతీ హరిప్రసాద్‌ నేతృత్వంలో ఓ మెడికల్ టీమ్ అక్కడకు వెళ్లింది. ఆ విషయం తెలిసిన అక్కడి ప్రజలు(60 నుంచి 70 మంది) గుంపుగా వారి వైపు వెళ్లారు. మాస్క్‌లు లేకుండా సామాజిక దూరం పాటించకుండా వారు మెడికల్ టీమ్‌పై దాడి చేశారు. కారు అద్దాలను కొడుతూ అసభ్య పదజాలంతో దూషించారు. అనుకోని పరిస్థితుల్లో డ్రైవర్‌ కారు విండోను ఓపెన్‌ చేయగా.. తలను లోపలికి పెట్టిన ఓ వ్యక్తి దగ్గుతూ.. మాకు కరోనా ఉంటే మీకు వస్తుంది అని అన్నాడని ద్యుతీ వెల్లడించారు.

వైరస్‌పై, కేసుల నంబర్లపై తాము తప్పుడు లెక్కలు చెబుతున్నామని, తమ లెక్కల వలనే ఆ ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా మార్చారని, దీంతో ఉపాదిని కోల్పోతున్నామని వారు అంటున్నారని ద్యుతీ తెలిపారు. ఇక వారి దాడితో తమ టీమ్‌లోని ఒక నర్సు ఏడ్చారని.. ఆ తరువాత వారిని ఎంతగానో ప్రార్థిస్తే అక్కడి నుంచి తమను పంపారని ద్యుతీ వివరించారు. ఇక విషయం తెలుసుకున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెడికల్‌ టీమ్‌ని కరోనా పరీక్షల నిమిత్తం క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. మరోవైపు ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. దీనిపై విచారణకు ఆదేశించినట్లు ఆరోగ్య మంత్రి కెకె శైలజ తెలిపారు. మూడు నెలలుగా ఆ ప్రాంతంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్న అక్కడి ప్రజలు అసహనానికి గురైనట్లు ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.