IMF కాదు.. ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్.. పాపాల పాకిస్తాన్కు రుణం మంజూరుపై తీవ్ర విమర్శలు..
పాకిస్థాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రుణంపై భారత్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పశ్చిమ దేశాల తీరును తప్పుపడుతున్నారు నేతలు.. పాకిస్తాన్ కు నిధులు ఇవ్వడం అంటే.. ఆయుధాల కొనుగోలుకు సహకరించినట్లేనని.. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ కాదది.. ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అంటూ కౌంటర్ ఇస్తున్నారు.

భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ప్రత్యర్థి దేశానికి భారీ సాయం అందింది. 100కోట్ల డాలర్ల రుణం తక్షణం ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి.. ఐఎంఎఫ్ ( International Monetary Fund) ముందుకొచ్చింది. 100కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీలో 8వేల 540కోట్లు. అదే పాకిస్థాన్ కరెన్సీలో 28వేల కోట్లు. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్.. ఐఎంఎఫ్ ఇచ్చే నిధుల్ని కూడా భారత్పై ఉగ్రవాదుల్ని ఉసిగొల్పేందుకు, అమాయకుల్ని చంపేందుకే వాడుతుందని.. దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. తుర్కియే, చైనా నుంచి డ్రోన్లు, ఇతర ఆయుధాలు కొనుగోలు చేసి.. తమపై దాడి చేసేందుకే ఈ నిధులను పాక్ వినియోగిస్తుందని భారత్.. ఐఎంఎఫ్ బోర్డ్ మీటింగ్లోనే ఎండగట్టింది. గతంలో తీసుకున్న అప్పులనే తీర్చని పాక్కు మళ్లీ రుణం ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది.
పాకిస్తాన్ కు నిధులు ఇవ్వడం అంటే.. ఆయుధాల కొనుగోలుకు సహకరించినట్లేనని విదేశాంగమంత్రి జై శంకర్ పేర్కొన్నారు. తమపై పాక్ దాడులు చేస్తుంటే రుణాలు ఏంటని ప్రశ్నించారు. పశ్చిమ దేశాలు తమ ఆలోచనా విధానం మార్చుకోవాలంటూ జై శంకర్ సూచించారు.
పాక్కు ఐఎంఎఫ్ రుణంపై తీవ్ర విమర్శలు చేశారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఐఎంఎఫ్ అంటే.. ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అన్నారు. పాక్ ఆర్థిక పరిస్థితే బాగోలేదు.. ఈ సమయంలో 1 బిలియన్ డాలర్ల రుణం ఏంటంటూ అసద్ ప్రశ్నించారు.
పాకిస్తాన్కు నిధులు ఇవ్వాలనే IMF నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. అంతర్జాతీయ సమాజం ఏ ఆలోచిస్తుందో అర్థం కావడంలేదు, పాకిస్తాన్కు నిధులు ఇవ్వడంతో ఉద్రిక్తతలు తగ్గవని చెప్పారు. పూంచ్, రాజౌరి, యురి, తంగ్ధార్ వంటి ప్రాంతాల్లో విధ్వంసాలను కొనసాగించేందుకు ఐఎంఎఫ్ డబ్బులిస్తుందని జమ్మూ కశ్మీర్ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..