AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. తన కన్న కొడుకును పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారు? అతను చేసిన తప్పులేంటి? పూర్తి వివరాలు

లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను ఆర్జేడీ పార్టీ నుండి బహిష్కరించారు. తేజ్ ప్రతాప్ వివాదాస్పద వ్యాఖ్యలు, జగదానంద్ సింగ్ తో వివాదాలు, ప్రధాని మోదీపై విమర్శలు ఈ నిర్ణయానికి కారణాలు. తన సొంత పార్టీ ఎమ్మెల్యేతో వివాదం, వివాహం తర్వాత విడాకుల పిటిషన్ కూడా ఇందుకు దోహదపడ్డాయి. ఈ సంఘటన బీహార్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలను సృష్టించింది.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. తన కన్న కొడుకును పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారు? అతను చేసిన తప్పులేంటి? పూర్తి వివరాలు
Lalu Prasad Yadav Son Tej P
SN Pasha
|

Updated on: May 25, 2025 | 5:46 PM

Share

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి అలాగే కుటుంబం నుంచి కూడా బహిష్కరించారు. ఆయనపై ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. నిజానికి, తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రత్యేకమైన వేశధారణ, పూజా ఆచారాలు, వివాదాస్పద వ్యాఖ్యలపై బిహార్ మీడియాలో తరచు నిలుస్తుంటారు. కొంతకాలం క్రితం ఈ సంవత్సరం హోలీ రోజున, తేజ్ ప్రతాప్ యాదవ్ తన బాడీగార్డ్‌ను హోలీ మిలన్ సందర్భంగా యూనిఫాంలో డ్యాన్స్‌ చేయమని ఆదేశించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ అంశం బిహార్‌ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.

జగదానంద్ సింగ్ తో వివాదం

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సీనియర్ సహాయకుడు జగదానంద్ సింగ్‌తో తేజ్ ప్రతాప్‌కు విభేదాలు ఉన్నట్లు సమాచారం. నిజానికి నాలుగు సంవత్సరాల క్రితం తేజ్ ప్రతాప్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ ప్రముఖ నాయకుడు, బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. జగన్నాథ్ సింగ్ కు వ్యతిరేకంగా ఆయన బహిరంగంగా తన స్వరాన్ని పెంచడమే కాకుండా, జగదానంద్ సింగ్ తో ఆయనకున్న శత్రుత్వం ఆర్జేడీ అగ్ర నాయకత్వాన్ని కూడా చేరేంతగా పెరిగింది. తేజ్ ప్రతాప్ యాదవ్ మద్దతుదారుడు ఆకాశ్ యాదవ్‌ను జగదానంద్ సింగ్ విద్యార్థి ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించి, గగన్ యాదవ్‌ను విద్యార్థి ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినప్పుడు వాస్తవానికి ఈ మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. గగన్ యాదవ్‌ను తేజస్వి యాదవ్ మద్దతుదారుగా పరిగణించేవారు.

ప్రధాని మోదీ గురించి వివాదాస్పద ప్రకటన

రెండేళ్ల క్రితం బీహార్‌లో మహా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, తేజ్ ప్రతాప్ యాదవ్ పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు అతను నరేంద్ర మోదీని దేశద్రోహి అని విమర్శించారు. ప్రతిపక్ష ఇండియా అలయన్స్ నాయకులను ప్రధాని మోదీ అహంకారి అని విమర్శించినప్పుడు ఆయన కౌంటర్‌గా ఆ వ్యాఖ్య చేశాడు. ఈ విషయంపై తేజ్ ప్రతాప్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఒక దేశద్రోహి అని అన్నారు. అప్పుడు బిజెపి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు వ్యతిరేకంగా గట్టి నిరసనలు తెలిపింది.

2017లో తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రధాని మోదీ గురించి అలాంటి ప్రకటన చేయడంపై సర్వత్రా చర్చ జరిగింది. వాస్తవానికి, 2017లో కేంద్ర ప్రభుత్వం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఉన్న Z ప్లస్ భద్రతను తొలగించింది. దీని కారణంగా మొత్తం రాష్ట్రంలో రాజకీయ వివాదం తలెత్తింది. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే తేజ్ ప్రతాప్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లాలూ జీ హత్యకు కుట్ర పన్నడంలో భాగంగానే ఆయనకు భద్రత తొలగించారంటూ తేజ్‌ ప్రతాప్‌ ఆరోపించారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేకు షాక్‌..

గత సంవత్సరం తేజ్ ప్రతాప్ యాదవ్ తన సొంత పార్టీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్‌కు షాకిచ్చారు. నిజానికి గత ఏడాది డిసెంబర్ నెలలో తేజ్ ప్రతాప్ యాదవ్, ముఖేష్ రోషన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అసెంబ్లీ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రకటనతో ముఖేష్ రోషన్ ఏకంగా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ మనల్ని పొలాలు దున్నమని చెబితే, మనం వెళ్లి పొలాలు దున్నుతామని కూడా ఆయన అన్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ డిసెంబర్‌లో మహువా అసెంబ్లీ నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. అక్కడ మీడియా తేజ్ ప్రతాప్ యాదవ్‌ను మహువా నుంచి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగారు. దీని తర్వాత, తేజ్ ప్రతాప్ యాదవ్ తాను గతంలో మహువా నుండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కొంత పని చేశానని చెప్పాడు. ఇక్కడి ప్రజలు కోరుకుంటే, నేను కచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ మహువాలో పని చేస్తాను అని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత ముఖేష్ రోషన్ ఏడుస్తున్న వీడియో వైరల్ అయింది.

కొన్ని నెలల్లోనే విడాకుల పిటిషన్

వివాహమైన కొన్ని నెలలకే తన భార్య ఐశ్వర్య రాయ్ పై విడాకుల పిటిషన్ దాఖలు చేయడం ద్వారా తేజ్ ప్రతాప్ యాదవ్ లాలూ కుటుంబానికి చాలా అసౌకర్య పరిస్థితిని సృష్టించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ 2018 మేలో ఐశ్వర్య రాయ్‌ను వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన కొన్ని నెలల తర్వాత అంటే నవంబర్ 2018లో తేజ్ ప్రతాప్ తన భార్య నుండి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం లాలూ కుటుంబానికి సంబంధించినది కాబట్టి దీనిని మీడియాలో రచ్చ రచ్చ అయింది. ఇలా మొత్తంగా పార్టీతో పాటు కుటుంబానికి కూడా పెద్ద తలనొప్పిగా మారిన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ నుంచి బహిష్కరించినట్లు సమాచారం.

మరిన్ని  జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి