రైల్వే స్టేషన్లను పేల్చేస్తాం: జైషే బెదిరింపు లేఖ
దేశంలో నరమేధం సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ సిద్ధమైంది. దసరా పండుగ రోజున ఆరు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడుతామని జైషే ఉగ్రవాదుల పేరిట రోహ్తక్ రైల్వే పోలీసులకు లేఖ రావడం తాజాగా కలకలం సృష్టిస్తోంది. ఆరు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లతో పాటు జన సమూహం ఉండే ఆలయాల్లో కూడా బాంబు దాడులకు తెగబడతామని అందులో ఉగ్ర సంస్థ పేర్కొంది. అక్టోబర్ 8న హర్యానాలోని రోహతక్ రైల్వే స్టేషన్తో పాటు ముంబై సిటీ, […]

దేశంలో నరమేధం సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ సిద్ధమైంది. దసరా పండుగ రోజున ఆరు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడుతామని జైషే ఉగ్రవాదుల పేరిట రోహ్తక్ రైల్వే పోలీసులకు లేఖ రావడం తాజాగా కలకలం సృష్టిస్తోంది. ఆరు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లతో పాటు జన సమూహం ఉండే ఆలయాల్లో కూడా బాంబు దాడులకు తెగబడతామని అందులో ఉగ్ర సంస్థ పేర్కొంది. అక్టోబర్ 8న హర్యానాలోని రోహతక్ రైల్వే స్టేషన్తో పాటు ముంబై సిటీ, బెంగళూరు, చెన్నై, జైపూర్, భోపాల్, కోటా, ఇటార్సీ రైల్వే స్టేషన్లను పేల్చివేస్తామని జైషే ఆ లేఖలో హెచ్చరించింది. అదే విధంగా రాజస్థాన్, జైపూర్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు ఆలయాల్లో కూడా పేలుళ్లకు పాల్పడతామని పేర్కొంది.
కాగా ఈ లేఖ రైల్వే జంక్షన్ సూపరిటెండెంట్ కార్యాలయానికి శనివారం 3గంటల ప్రాంతంలో పోస్ట్ ద్వారా వచ్చింది. పాకిస్తాన్లోని కరాచీ నుంచి మసూద్ అహ్మద్ పేరిట వచ్చిన ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేవారు. లేఖలో పేర్కొన్న ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అయితే జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో భారత్లో దాడులు చేసేందుకు పాకిస్థాన్కు చెందిన పలు ఉగ్రసంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇంటిలిజెన్స్ వర్గాలు కేంద్రానికి హెచ్చరించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది కేంద్రం. మరోవైపు భారత నేవీ, ఆర్మీ, ఎయిర్ఫోర్స్ స్థావరాలపై కూడా దాడి చేసేందుకు ఉగ్రవాదులు పథకాలు రచిస్తున్నారని సమాచారం.