
పచ్చని పెళ్లి పందిరిలో పెను విషాదం చోటు చేసుకుంది. వేద పండితులు మంత్రోచ్ఛారణలతో, బంధుమిత్రుల మధ్య మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాల్సిన జంట.. ప్రాణాపాయంలో చిక్కుకుంది. పెళ్లి సందర్భంగా జరిగిన చిన్న గొడవ.. వరుడి ప్రాణాలను తీసేయంగా.. వధువు ప్రాణాపాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో చోటు చేసుకుంది.
ఈ ఘోరానికి సంబంధించి స్థానిక ఏఎస్ఐ రంజాన్ ఖాన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కనాడియా ప్రాంతంలోని ఆర్య సమాజ్లో అమ్మాయికి, అబ్బాయికి పెల్లి జరుగుతోంది. అయితే, పెళ్లి పీఠలపై కూర్చునే సమయంలో తాను విషం తాగినట్లు వధువుకు చెప్పాడు వరుడు. దాంతో కంగారుపడిపోయిన వధువు.. పెద్దలను అలర్ట్ చేసింది. వెంటనే వారు వరుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే, వరుడు విషం తాగడంతో తాను కూడా విషం తాగింది వధువు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ విషాదంపై వరుడి కుటుంబ సభ్యులు తమ వెర్షన్ చెప్పారు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ప్రేమించుకున్నారని, అయితే, పెళ్లికి అంగీకరించినప్పటికీ.. కెరీర్ దృష్ట్యా రెండేళ్ల సమయం కావాలని అబ్బాయి కోరాడని తెలిపారు. అయితే, అమ్మాయి వినిపించుకోకుండా.. పోలీసులను ఆశ్రయించింది. దాంతో అతను పెళ్లికి ఒప్పుకున్నాడని, చివరకు ఇలా చేశాడని వాపోయారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..