మురుగు నీటిలో వారం పాటు వైరస్..మూడోదశపై 3వారాల్లో క్లారిటీ! ఐఐసీటీ స్టడిలో సంచలనాలు
కరోనా సేకండ్వేవ్ ప్రజలను కకావికలం చేస్తోంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీని నుంచి బతికి బట్టకట్టడమే కర్తవ్యంగా...
కరోనా సేకండ్వేవ్ ప్రజలను కకావికలం చేస్తోంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీని నుంచి బతికి బట్టకట్టడమే కర్తవ్యంగా పోరాడుతున్నారు దేశ ప్రజలు. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. కరోనా సోకిన వారి నాసికా ద్రవాలు, నోటి మార్గాల ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్ బహిర్గతవుతుందని, మురుగునీటిలో కరోనా వైరస్ ఏడు రోజుల పాటు బతికుంటుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) హైదరాబాద్ సైటిస్టుల పరిశోధనలో వెల్లడైంది.
ఏడాది కాలంగా మురుగు నీళ్లు కలుస్తున్న చెరువులు, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లలోని శాంపిళ్లను సేకరించి సైంటిస్టులు స్టడీ చేశారు. వైరస్ మనుగడ, దాని జీన్స్లో జరిగే మార్పులు వైరస్ వ్యాపించే తీవ్రత వంటి వాటిని పరిశీలించారు. వాటి ఆధారంగా కరోనా సెకండ్వేవ్తో పాటు థర్డ్వేవ్పైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్టడీలో భాగంగా 1.8లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతాల్లోని చెరువుల నుంచి శాంపిళ్లను సైంటిస్టులు సేకరించారు. తార్నాక, లాలాగూడ, హెచ్ఎంటీ నగర్, నాచారం, రాఘవేంద్రనగర్ లలోని మురుగు నీటిని చెరువుల దగ్గర ఉన్న ఎస్టీపీ ఇన్లెట్, అవుట్ లెట్ల నుంచి నమూనాలను తీసుకున్నారు. ఒక్కో లీటర్ మురుగు నీటిలో 45,456 కరోనా జీన్స్ ఉన్నట్లు గుర్తించారు.
ఎస్టీపీ ఔట్లెట్లలో వైరస్ జీన్స్ ఉన్నా మార్పులకు అవకాశం లేని స్థితిలో ఉందని తేల్చారు. మురుగు నీటిలో వైరస్ జీన్స్లో మార్పులు గత ఏడాది డిసెంబర్ నుంచే జరుగుతున్నాయని కన్ఫర్మ్ చేశారు. మరోమూడు వారాల్లో దీనికి సంబంధించిన రిపోర్ట్ను ఇస్తామని స్టడీలో పాల్గొన్న ఐఐసీటీ సైంటిస్ట్లు చెప్పారు. దీని ద్వారా దేశంలో కరోనా థర్డ్ వేవ్కు సంబంధించిన వివరాలను తెలుసుకునే వీలు కలుగుతుందని చెప్పారు.