
ఎంత నిఘా పెట్టినా..డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. యూతే టార్గెట్గా మత్తు పదార్థాలను సరఫరా చేస్తోంది. ఇందుకోసం నయా రూట్లను ఎంచుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీ డ్రగ్స్ దందా బయటపడింది. ఓ మహిళ శరీరంలో ఒకటి కాదు.. రెండు కాదు.. 82 కొకైన్ క్యాప్సూల్స్ గుర్తించారు అధికారులు. వాటి విలువ సుమారు 16 కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు. పట్టుబడ్డ మహిళ గినియా దేశస్తురాలిగా గుర్తించారు. మహిళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా కొకైన్ క్యాప్సూల్ మింగినట్లు ఆమె అంగీకరించింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆమె శరీరంలోపల నుంచి 82 క్యాప్సూల్స్ రికవరీ చేసి కొకైన్ గా గుర్తించారు. మొత్తం 1,024 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 15.36 కోట్లు ఉంటుందని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికురాలిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. గినియాకు చెందిన మహిళ డిసెంబరు 7న కోనాక్రి (గినియా) నుంచి అడిస్ అబాబా మీదుగా ఢిల్లీకి వచ్చినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నిపుణుల వైద్య పర్యవేక్షణలో క్యాప్సూల్స్ ను బయటకు తీసినట్లు తెలిపారు. ఈ ఎజెక్షన్ ప్రక్రియ చాలా రోజుల పాటు కొనసాగిందని.. వెల్లడించారు.
ఇదిలా ఉంటే మరో 10 రోజుల్లో న్యూ ఇయర్ వచ్చేస్తోంది. దీంతో ఫుల్ జోష్లో ఉన్నారు యూత్. న్యూఇయర్ సెలబ్రేషన్స్కు రెడీ అవుతున్నారు. కొత్త సంవత్సరాన్ని మాంచి జోష్లో స్టార్ట్ చేసేందుకు సరికొత్తగా ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఐతే ఇదే అదునుగా సందట్లో సడేమియాలా క్యాష్ చేసుకోవాలనుకుంటోంది డ్రగ్స్ మాఫియా. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముసుగులో కోట్లాది రూపాయల డ్రగ్స్ను దేశంలోకి డంప్ చేస్తున్నారు. ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్కతా, గోవా, హైదరాబాద్ ఇలా మహానగరాల్లో మాదకద్రవ్యాలు పట్టుబడుతునే ఉన్నాయి.
ఇటీవలే తమిళనాడులో భారీగా డ్రగ్స్ దందా బయటపడింది. రామనాథపురం జిల్లా మండపంలో జరిపిన తనిఖీల్లో 160కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. రామేశ్వరం నుంచి శ్రీలంకకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారన్న సమాచారంతో.. ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు..డ్రగ్స్ పెడ్లర్స్ ఆట కట్టించారు. వారిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
ఇక వారం క్రితం భాగ్యనగరంలో సింథటిక్ డ్రగ్స్ కలకలం సృష్టించాయి. చదువుల పేరుతో హైదరాబాద్కొచ్చిన ఆఫ్రికన్ స్టూడెంట్స్ కొందరు.. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నారు. స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయిసే వీళ్ల టార్గెట్స్. ఇంజినీరింగ్ కాలేజీలు, సాఫ్ట్వేర్ కంపెనీలుండే ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకొని అక్కడే మకాం వేసి డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారు. గత ఏడెనిమిది నెలల్లోనే 75 కిలోల డ్రగ్స్ను విదేశాలకు సప్లై చేసినట్టు గుర్తించారు. కిలో సింథటిక్ డ్రగ్.. కోటి రూపాయలపైనే ఉంటుందని తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..