స్థానిక భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లు.. భాగస్వాములవ్వాంటూ ఐటీ పరిశ్రమకు పిలుపు..
భారతదేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్ సైట్లన్నీ స్థానిక భాషల్లోనూ..
భారతదేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్ సైట్లన్నీ స్థానిక భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్ని తెలిపారు. ప్రజలు భాషా పరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని భాషల్లోనూ ప్రభుత్వ వివరాలు తెలుసుకునే రోజులు రావాలనేదే తమ ఆకాంక్ష అని అజయ్ చెప్పారు. నేషనల్ లాంగ్వేజెస్ టెక్నాలజీ మిషన్ (ఎన్ఎల్టీఎం)కు ఒక సమగ్ర రూపం ఇవ్వడానికిగానూ భాషా నిపుణులు, పరిశోధకులు, పరిశ్రమ వర్గాలతో విస్తృత చర్చలు పూర్తయ్యాయని తెలిపారు. 2021 డిసెంబరు లేదా జనవరిలో ఎన్ఎల్టీఎం ఏర్పాటుపై ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయన్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ‘ఫిక్కీ’ ఆధ్వర్యంలో ‘భాషాంతర’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న అజయ్.. అన్ని భాషల్లోనూ ప్రభుత్వ వెబ్సైట్లను అందుబాటులోకి తెచ్చేందుకు దోహదపడే పరిజ్ఞానాన్ని, సాంకేతిక ఉపకరణాలను అందబాటులోకి తీసుకురావాలని ఐటీ పరిశ్రమకు పిలుపునిచ్చారు. ఈ బృహత్తర యజ్ఞంలో బహుళజాతి దిగ్గజ కంపెనీలు కూడా భాగస్వాములు కావాలని సాహ్ని కోరారు.