
బఠిండా ఆర్మీ క్యాంప్లో కాల్పులతో పంజాబ్ ఉలిక్కి పడింది. దీంతో ఆర్మీక్యాంప్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సమీప ప్రాంతాల ప్రజలను ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నిమిషాల్లోనే ఆర్మీక్యాంప్ పరిసరాలు మొత్తం భద్రతా బలగాల అధీనంలోకి వెళ్లాయి. క్విక్ రియాక్షన్ టీమ్తోపాటు పంజాబ్ పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆర్మీక్యాంప్లోకి ఎవరూ వెళ్లకుండా.. బయటకు రాకుండా అన్నీ గేట్లను మూసివేశారు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోవడంతో బఠిండా ఆర్మీ క్యాంప్లో అలజడి రేగింది. సమాచారం అందుకున్న వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు అధికారులు. బయట నుంచి ఎవరూ ఆర్మీ క్యాంప్లోకి రాలేదని ప్రాథమికంగా నిర్థారించినా.. ఉగ్రకోణంలోనూ ఆరా తీస్తున్నారు. పంజాబ్ పోలీసులు మాత్రం ఉగ్రదాడికి ఆస్కారం లేదని కొట్టి పారేస్తున్నారు.
సమీప ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు చెప్పడంతో.. బఠిండా ఆర్మీ క్యాంప్లో అసలేం జరిగింది అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రెండు రోజుల క్రితం క్యాంప్లో ఇంసాస్ రైఫిల్తోపాటు 28 తూటాలు మిస్ అయినట్టు చెబుతున్నారు. ఇంసాస్ రైఫిల్ మిస్సింగ్కు కాల్పులకు ఏదైనా లింక్ ఉందా అనేది కూడా ఆరా తీస్తున్నారు. లోపల ఏదో జరిగిందని.. సైన్యం వివరాలను పంచుకోలేదని భటిండా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు. ఆర్మీ అంతర్గత కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని అంతర్గత పరిణామంగా అనిపిస్తోందని ఎస్ఎస్పీ ఖురానా తెలిపారు.
“దురదృష్టకర సంఘటన.. తుపాకీ కాల్పులతో ఆర్టిలరీ యూనిట్కు చెందిన నలుగురు ఆర్మీ జవాన్లు మరణించినట్లు నిర్ధారణ అయింది. సిబ్బందికి ఇతర గాయాలు లేదా ఆస్తి నష్టం గురించి నివేదించలేదు”అని ఆర్మీ హెచ్క్యూ సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతాన్ని మూసివేసి వాస్తవాలను నిర్ధారించడానికి పంజాబ్ పోలీసులతో సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నట్లు సైన్యం తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..