RGF: గాంధీ కుటుంబానికి చెందిన స్వచ్ఛంద సంస్థలకు షాక్.. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు..
గాంధీ కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వేతర సంస్థలైన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జిఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్జిసిటి)లకు సంబంధించిన విదేశీ విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఫారిన్..
గాంధీ కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వేతర సంస్థలైన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జిఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్జిసిటి)లకు సంబంధించిన విదేశీ విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సిఆర్ఎ) లైసెన్స్ను కేంద్రం ప్రభుత్వం రద్దు చేసింది. ఆర్జిఎఫ్, ఆర్జిసిటిలలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆర్జిఎఫ్కు సారథ్యం వహిస్తుండగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఈసంస్థలో సభ్యులుగా ఉన్నారు. ఆర్ జిసిటికి కూడా సోనియాగాంధీ అధినేతగా ఉన్నారు. ఎంపీ రాహుల్ గాంధీతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ అశోక్ శేఖర్ గంగూలీ సభ్యులుగా ఉన్నారు. గాంధీ కుటుంబానికి చెందిన ఎన్జీవోలలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు 2020లో హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అంతర్-మంత్రిత్వ కమిటీ పరిశోధనల తర్వాత ఈ చర్య తీసుకుంది.
ఇన్కమ్ టాక్స్ రిటర్న్లను దాఖలు చేసేటప్పుడు పత్రాలను తారుమారు చేయడం, నిధుల దుర్వినియోగంతో పాటు చైనాతో సహా ఇతర దేశాల నుండి నిధులు పొందుతున్నప్పుడు మనీలాండరింగ్ జరిగినట్లు ఈ ఎన్జీవోలపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ విచారణ జరిపింది. రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్జిసిటి)ను 2022లో దేశంలోని అణగారిన ప్రజల, ముఖ్యంగా గ్రామీణ పేదల అభివృద్ధి అవసరాలను తీర్చడానికి స్థాపించారు. గాంధీ కుటుంబానికి అనుబంధంగా ఈ సంస్థలు ఉన్నాయి. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ స్థాపించారు.
1991 జూలైలో సోనియా గాంధీ నేతృత్వంలో ఫౌండేషన్ కోసం తీర్మానం ఆమోదించింది. 1991లో స్థాపించిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ 1991 నుండి 2009 వరకు ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళలు, పిల్లలు, వికలాంగుల సహాయం మొదలైన అనేక ముఖ్యమైన సమస్యలపై పని చేసింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వెబ్సైట్ ప్రకారం ఈ సంస్థ విద్యా రంగంలో కూడా పనిచేసింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్లకు చైనా నుండి నిధులు అందుతున్నాయన్న అంశంపై దర్యాప్తునకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ), ఆదాయపు పన్ను చట్టం, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ (ఎఫ్సిఆర్ఎ) మొదలైన పలు చట్టపరమైన నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు చేసేందుకు మంత్రిత్వ శాఖ ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..