టీవీకే అధినేత విజయ్‌ మీటింగ్‌లో తొక్కిసలాట.. పలువురు మృతి.. ప్రధాని దిగ్భ్రాంతి

తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ అధినేత, సినీ నటులు విజయ్‌.. ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా ఇప్పటివరకు 31 మంది మరణించారని తమిళనాడు పోలీసులు తెలిపారుసహాయక చర్యలు, వైద్య సహాయం కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు

టీవీకే అధినేత విజయ్‌ మీటింగ్‌లో తొక్కిసలాట.. పలువురు మృతి.. ప్రధాని దిగ్భ్రాంతి
Vijay Public Meeting

Edited By:

Updated on: Sep 27, 2025 | 10:48 PM

తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ అధినేత, సినీ నటులు విజయ్‌.. ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా ఇప్పటివరకు 31 మంది మరణించారని తమిళనాడు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు, వైద్య సహాయం కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. చాలా మంది కరూర్ ప్రభుత్వ ఆసుపత్రి తోపాటు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు.

కాగా ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు కరూర్‌లో రాజకీయ ర్యాలీ సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటన చాలా దుఃఖం కలిగిస్తుందన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం లభించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. గాయపడ్డవారికి త్వరిత నయం కలగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

మీట్‌ ది పీపుల్‌ నినాదంతో తమిళనాడు వెట్రి కాగం (టీవీకే) పార్టీ అధినేత, సినీ నటులు విజయ్‌.. ప్రతి శనివారం రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ శనివారం (సెప్టెంబర్ 27) నామక్కల్‌, కరూర్‌లలో పర్యటిస్తున్నారు విజయ్. అయితే, విజయ్‌ ప్రచార సభకు స్థల ఎంపిక, అనుమతి వ్యవహారం ప్రతివారం వివాదానికి దారి తీస్తోంది. పోలీసులు సూచించిన ప్రదేశాన్ని విజయ్‌ వర్గీయులు, ఆయన వర్గీయులు ఎంపిక చేసిన ప్రదేశాన్ని పోలీసులు నిరాకరిస్తూ వచ్చారు. దీంతో పర్యటన సాగేనా? అన్న చర్చ బయలు దేరింది. ఎట్టకేలకు పోలీసులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇవాళ్టి సభ జరిగింది. అయితే భారీగా వచ్చిన అభిమానులను నిర్వాహకులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది.

ఈరోజు కరూర్, నామక్కల్ అనే రెండు జిల్లాల్లో విజయ్ ప్రచారం చేశారు. దీని కోసం ఆయన ఉదయం చెన్నై నుండి ఒక ప్రైవేట్ విమానంలో తిరుచ్చికి వచ్చారు. తరువాత అక్కడి నుండి రోడ్డు మార్గంలో నామక్కల్ చేరుకున్నారు. కరూర్‌లో భారీ జనసందోహంతో భారీ ర్యాలీ నిర్వహించారు.  అభిమాన నాయకుడి రాక కోసం పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. అయితే ఈ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనీసం 31 మంది మరణించగా, డజన్ల కొద్దీ జనం గాయపడ్డారని తమిళనాడు పోలీసులు తెలిపారు. విజయ్ ప్రచారానికి పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో తొక్కిసలాట పరిస్థితి నెలకొంది.  మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కరూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన వారికి చికిత్సను స్వయంగా పర్యవేక్షించాలని మంత్రి వి. సెంథిల్‌బాలాజీ, రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా. సుబ్రమణియన్‌లను సీఎం స్టాలిన్ ఆదేశించారు. తగినంత వైద్య సదుపాయాలు, వైద్యులు, అత్యవసర సంరక్షణ వెంటనే అందుబాటులో ఉండేలా చూడాలని ఇద్దరు మంత్రులను కోరారు. మరోవైపు సంఘటనాస్థలానికి చేరుకున్న సహయక బృందాలు గాయపడ్డవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..