Railway Job Fraud: రైల్వే స్టేషన్‌లో వచ్చిపోయే రైళ్లను లెక్కించాలని నిరుద్యోగులకు టోకరా.. 2.7 కోట్లు వసూలు చేసిన కేటుగాడు

రోజుకు 8 గంటల పాటు స్టేషన్‌కు వచ్చేపోయే రైళ్లను, వాటి బోగీలను లెక్కించాలని, ఆ ఉద్యోగాలకు ఇదే శిక్షణ అని నమ్మబలికాడు. ఈ 28 మంది యువకులు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో నెల రోజుల పాటు రైళ్లను లెక్కించారు.

Railway Job Fraud: రైల్వే స్టేషన్‌లో వచ్చిపోయే రైళ్లను లెక్కించాలని నిరుద్యోగులకు టోకరా.. 2.7 కోట్లు వసూలు చేసిన కేటుగాడు
Delhi Railway Job Fraud
Follow us

|

Updated on: Dec 20, 2022 | 3:56 PM

నిరుద్యోగ యువతే లక్ష్యంగా కేటుగాళ్లు రెచ్చి పోయారు. డిగ్రీలు, బీటెక్‌లు పూర్తి చేసి.. ఉద్యోగాల కోసం వెతుకుతున్నయువతకు ప్రభుత్వ ఉద్యోగం ఆశ చూపించి కోట్ల రుపాయాలు కొల్లగొట్టారు. భారతీయ రైల్వేలో ఉద్యోగాల పేరుతో కోట్లలో వసూలు చేసి నిరుద్యోగులను నిలువునా ముంచేశారు. అయితే ఈ నిరుద్యోగులు చేయాల్సిన ఉద్యోగం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇలాంటి ఉద్యోగాలు ఉన్నాయని నమ్మి డబ్బులు లంచంగా ఇచ్చిన యువత మీద జాలిపడాలో కోపడాలో తెలియని స్టేజ్ కు చేరుకుంటాం.. ఎందుకంటే ఆ రేంజ్ లో నిరుద్యోగులకు వల వేసి ముంచేశాడు మరి ఓ కేటుగాడు..

తమిళనాడుకు చెందిన సుబ్బుసామి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయ్యారు. కొన్ని నెలల కిందట ఆయనకు దేశ రాజధాని ఢిల్లీ లోని ఎంపీ క్వార్టర్స్‌లో కోయంబత్తూరుకు చెందిన శివరామన్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. శివ రామన్ తనకు ఎంపీలు, మంత్రులు బాగా తెలుసని, ఎవరైనా ఉంటే రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని సుబ్బుస్వామికి చెప్పాడు. అది నమ్మిన సుబ్బుసామి తనకు తెలిసిన ముగ్గురు యువకులను  ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసి మరో 25 మంది ఉద్యోగాల కోసం సుబ్బుసామిని కలిశారు. అలా మొత్తం 28 మంది నిరుద్యోగులందరినీ తీసుకుని శివరామన్‌.. వికాస్‌ రాణా అనే వ్యక్తికి పరిచయం చేశాడు. ఢిల్లీ ఉత్తర రైల్వే కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానంటూ రాణా వారిని నమ్మించాడు. రైల్వేలో టీటీఈ, ట్రాఫిక్‌ అసిస్టెంట్, క్లర్క్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించాడు. బాధితుల నుంచి నకిలీ శిక్షణ అంటూ రూ.2 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు మొత్తం రూ.2.67 కోట్లు వరకూ వసూలు చేశాడు.

తర్వాత రాణా ఫోర్జరీ పత్రాలతో శిక్షణ ఆర్డర్లు, ఐడీ కార్డులు కూడా ఇచ్చేశాడు. అనంతరం 28 మంది యువకులకు నెల రోజుల పాటు ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్‌లో శిక్షణ కూడా ఇప్పించాడు. రోజుకు 8 గంటల పాటు స్టేషన్‌కు వచ్చేపోయే రైళ్లను, వాటి బోగీలను లెక్కించాలని, ఆ ఉద్యోగాలకు ఇదే శిక్షణ అని నమ్మబలికాడు. ఈ 28 మంది యువకులు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో నెల రోజుల పాటు రైళ్లను లెక్కించారు. తమకు కేటాయించిన ఉద్యోగం తమను మోసం చేయడానికి రూపొందించిన విస్తృతమైన ఉద్యోగ కుంభకోణంలో భాగమని బాధితులకు తెలియదు. ఈ ఏడాది జూన్‌-జులైలో నెల రోజల పాటు ఈ శిక్షణ పూర్తి చేసుకున్న 28 మంది యువకులకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు కూడా జారీ చేశాడు. వాటిని పట్టుకుని రైల్వే అధికారుల వద్దకు వెళితే.. అవి ఫోర్జరీ పత్రాలని తేలింది. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న ఆ 28 మంది సుబ్బుసామిని ఆశ్రయించారు. దీంతో ఆయన ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

రైల్వే మంత్రిత్వ శాఖలోని మీడియా మరియు కమ్యూనికేషన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బవేజా మాట్లాడుతూ.. ఇలాంటి మోసపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా రైల్వే బోర్డు క్రమం తప్పకుండా సలహాలు, సాధారణ ప్రజలను హెచ్చరిస్తుంది. యువకులు ఇలాంటి అంశాలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎల్లప్పుడూ సంబంధిత రైల్వే అధికారులను సంప్రదించాలి” అని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..