ఓర్నాయనో.! ఏకంగా ఎర్రకోటకే కన్నం వేశారు.. ఏం చోరీ చేశారో తెలిస్తే షాక్..!
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జరిగిన జైన మతపరమైన ఆచారం సందర్భంగా కోటి రూపాయల విలువైన బంగారం, వజ్రాలు పొదిగిన కలశం మాయమైంది. ఈ సంఘటన సెప్టెంబర్ 2న జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడి కార్యకలాపాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించారు.

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో ఒక పెద్ద దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. ఎర్రకోట పార్కులో నిర్వహించిన జైన మతపరమైన ఆచారం నుండి ఒక అమూల్యమైన కలశం మాయమైంది. ఈ సంఘటన సెప్టెంబర్ 2 మంగళవారం జరిగిందని పోలీసులు తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కార్యక్రమానికి వచ్చిన సమయంలో ఇది బయటపడింది. ఆయనను స్వాగతిస్తున్న సమయంలో, కలశం అదృశ్యమైంది. వ్యాపారవేత్త సుధీర్ జైన్ ప్రతిరోజూ పూజ కోసం కలశం తీసుకువచ్చేవాడని పోలీసులు తెలిపారు.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడి కార్యకలాపాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. పోలీసులు నిందితుడిని కూడా గుర్తించారు. త్వరలోనే అరెస్టు చేసే, సొత్తు స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు. ఎర్రకోట సముదాయంలోని జైన సమాజం ఆధ్వర్యంలో కలశ పూజ ఆచారం ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 9 వరకు కొనసాగుతుంది. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోయారు. కోట్ల రూపాయల విలువైన కలశాన్ని దొంగిలించారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో ప్రయత్నిస్తున్నారు.
దొంగిలించిన కలశం చాలా విలువైనదని, దాని విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మొత్తం కలశం బంగారం, వజ్రాలతో పొదిగి ఉందని, ఇది 760 గ్రాముల బంగారంతో తయారు చేసిందని చెబుతున్నారు. కలశంపై 150 గ్రాముల వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలు పొదిగి ఉన్నాయని సమాచారం. ఇంత విలువైన కలశం దొంగతనం కలకలం సృష్టించింది. దీనికి ముందు కూడా ఎర్రకోట వద్ద భద్రతా లోపం బయటపడింది. ఆగస్టు 2న, ఎర్రకోట భద్రత కోసం మోహరించిన పోలీసులు బాంబును గుర్తించలేకపోయినప్పుడు ఒక కేసు వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం, ఆగస్టు 2న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్స్లో భాగంగా మాక్ డ్రిల్ కోసం స్పెషల్ సెల్ బృందం సాధారణ దుస్తుల్లో వచ్చింది. వారు తమతో పాటు నకిలీ బాంబును తీసుకుని ఎర్రకోటలోకి ప్రవేశించారు. కానీ ఎర్రకోట భద్రత కోసం మోహరించిన పోలీసులు బాంబును గుర్తించలేకపోయారు. అప్పుడు నిర్లక్ష్యం కారణంగా పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు దొంగతనం సంఘటన వెలుగులోకి వచ్చింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




