Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌పై మాటలయుద్దం.. రాహుల్‌ గాంధీ సంచలన ట్వీట్‌.. విదేశాంగశాఖ క్లారిటీ

ఆపరేషన్‌ సింధూర్‌తో పాక్‌లో నక్కిన ఉగ్రవాదుల తాట తీశామని కేంద్రం చెబుతుంటే .. విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ స్టేట్‌మెంట్‌తో దాడిపై పాకిస్తాన్‌కు ముందే సమాచారం అందిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. జైశంకర్‌ మాటలను రాహుల్‌ తప్పుగా అర్ధం చేసుకున్నారని విదేశాంగశాఖ వివరణ ఇచ్చింది.

Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌పై మాటలయుద్దం.. రాహుల్‌ గాంధీ సంచలన ట్వీట్‌.. విదేశాంగశాఖ క్లారిటీ
Jaishankar Rahul Gandhi

Updated on: May 17, 2025 | 8:52 PM

ఆపరేషన్‌ సింధూర్‌పై కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటలయుద్దం మరింత ముదిరింది. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తూ సంచలన ట్వీట్‌ చేశారు. ఆపరేషన్‌ సింధూర్‌పై పాకిస్తాన్‌కు ముందే సమాచారం అందేలా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ మాట్లాడారని రాహుల్‌ విమర్శించారు. జైశంకర్‌ మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేశారు. జైశంకర్‌ ఇలా మాట్లాడడం నేరమే అవుతుందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. విదేశాంగశాఖ మంత్రి స్టేట్‌మెంట్‌తో భారత్‌ ఎన్ని యుద్ద విమానాలు కోల్పోయిందో చెప్పాలన్నారు.

జైశంకర్‌ స్టేట్‌మెంట్‌ను రాహుల్‌ తప్పుగా అర్ధం చేసుకున్నారు: MEA

అయితే రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. జైశంకర్‌ స్టేట్‌మెంట్‌ను రాహుల్‌ తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపింది. పాకిస్తాన్‌ పౌరులను భారత్‌ టార్గెట్‌ చేయలేదని , కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్‌ చేశాయని వివరించారు.

రాహుల్ గాంధీ ట్వీట్..

అమిత్‌షా కీలక వ్యాఖ్యలు

మరోవైపు గాంధీనగర్‌ పర్యటనలో ఆపరేషన్‌ సింధూర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2014కు ముందు భారత్‌పై ఉగ్రవాద దాడులు జరిగేవన్నారు. 2014లో మోదీ అధికారం లోకి వచ్చాక మూడు పెద్ద దాడులు జరిగాయని అన్నారు. కాని యూరీ , పుల్వామా , పహల్గామ్‌ దాడులకు వెంటనే ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. పాకిస్తాన్‌లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను ధ్వంసం చేశామన్నారు. ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించామన్నారు. అందుకే ఆపరేషన్‌ సింధూర్‌తో వాళ్ల హెడ్‌క్వార్టర్స్‌ను ధ్వంసం చేశామని.. ఆపరేషన్‌ సింధూర్‌ను చూసి ప్రపంచవ్యాప్తంగా డిఫెన్స్‌ నిపుణులు ఆశ్చర్యానికి గురయ్యారంటూ పేర్కొన్నారు.

పాకిస్తాన్‌లో 9 ప్రాంతాల్లో దాడులు చేశామన్నారు అమిత్‌షా. ప్రధాని మోదీ దేశ ప్రజలకు మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. మొత్తానికి ఆపరేషన్‌ సింధూర్‌తో దేశ ప్రతిష్ట పెరిగిందని బీజేపీ నేతలు చెబుతుంటే .. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారని, అమెరికా ఎందుకు జోక్యం చేసుకుందని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..