బిజెపికి బంద్‌గల్లా..! సెటైర్లేసిన కాంగ్రెస్..ఎలా ?

|

Nov 09, 2019 | 3:56 PM

సుదీర్ఘ కాలం సాగిన అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. దేశంలో ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సుప్రీం తీర్పును స్వాగతించాయి. దేశంలో మత సామరస్యం కొనసాగాలని, ఈ తీర్పుతో ఎవరు గెలిచినట్లు.. ఎవరు ఓడినట్లు భావించరాదని పిలుపునిచ్చాయి. హిందూ, ముస్లింలు భాయీ భాయీలా కలిసి వుండే లౌకిక వారసత్వం కొనసాగాలని ఆకాంక్షించాయి. ఇంత వరకు బాగానే వుంది. కానీ కాంగ్రెస్ పార్టీనే ఓ అడుగు ముందుకేసి ఓ ప్రకటన చేసింది. […]

బిజెపికి బంద్‌గల్లా..! సెటైర్లేసిన కాంగ్రెస్..ఎలా ?
Follow us on

సుదీర్ఘ కాలం సాగిన అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. దేశంలో ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సుప్రీం తీర్పును స్వాగతించాయి. దేశంలో మత సామరస్యం కొనసాగాలని, ఈ తీర్పుతో ఎవరు గెలిచినట్లు.. ఎవరు ఓడినట్లు భావించరాదని పిలుపునిచ్చాయి. హిందూ, ముస్లింలు భాయీ భాయీలా కలిసి వుండే లౌకిక వారసత్వం కొనసాగాలని ఆకాంక్షించాయి. ఇంత వరకు బాగానే వుంది. కానీ కాంగ్రెస్ పార్టీనే ఓ అడుగు ముందుకేసి ఓ ప్రకటన చేసింది. కాంగ్రెస్ ప్రకటనను చూసి జనం ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఏంటా ప్రకటన ?

అయోధ్య కేసులో తీర్పు రావడంతో ఇక దేశంలో బిజెపికి ఏ అంశమూ లేదని.. ఆ పార్టీకి బంద్‌గల్లా (బంద్ గల్లా సూట్ కాదు.. గొంతు ఆగిపోయింది అన్నది కాంగ్రెస్ నేతల ఉద్దేశం) పడిందని కాంగ్రెస్ నేతలంటున్నారు. సుప్రీం తీర్పుపై స్పందించేందుకు న్యూఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ పార్ట అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడారు. అయోధ్య తీర్పును స్వాగతిస్తున్నామని, వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించబడాలని కోరుకుంటున్నామని తెలిపారు.

అయోధ్య వివాదం సమసిపోయినందున ఇక బిజెపి మాట్లాడేందుకు అంశాలే లేవని సుర్జేవాలా అన్నారు. నిజానికి బిజెపి అయోధ్య అంశంపై జపం చేయడం మానేసి చాలా కాలమే అయ్యింది. ఆలాంటి పరిస్థితిలో రణదీప్ సుర్జేవాలా ఇలా ‘‘బిజెపికి బంద్ గల్లా’’ పడిందని వ్యాఖ్యానించడంతో ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన విలేకరులు ఆశ్చర్యపోయారట.

1987-1992 మధ్యకాలంలో బిజెపి అయోధ్య రామమందిర అంశం ఊతంగా చేసుకుని లోక్‌సభలో రెండు సీట్ల నుంచి 89 సీట్లకు ఎదిగింది. ఆ తర్వాత 1991లో అధికారం ఖాయమనుకున్న తరుణంలో రాజీవ్ గాంధీ హత్య చేయబడడంతో సానుభూతి పవనాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, బిజెపి అవకాశాలపై నీళ్ళు జల్లింది. ఆ తర్వాత 1992లో అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు వ్యూహాత్మక ఉదాసీనత అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేతకు కారణమైంది.

ఆ తర్వాత బిజెపి అయోధ్య అంశంపై అడపాదడపా మాట్లాడడమే కానీ అదే ఎజెండాగా రాజకీయం చేసింది లేదు. ప్రతీ సారి ఎన్నికల్లో అయోధ్యలో మందిర నిర్మాణంపై నామమాత్రపు హామీ ఇవ్వడం తప్ప 1998-2004 మధ్య అధికారంలో వున్నప్పుడు మందిర నిర్మాణం కోసం పని చేసింది లేదు. కారణమేంమంటే.. సంకీర్ణ సర్కార్‌కు సారథ్యం వహిస్తున్నాం కాబట్టి సొంత ఎజెండా కాదు.. ఉమ్మడి ఎజెండా ప్రకారమే పని చేయాలని చెప్పుకునేవారు కమలనాథులు.

ఆ తర్వాత 2014లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బిజెపి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అయోధ్యలో మందిర నిర్మాణం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రత్యేక చట్టం తేవడం ద్వారా రామ మందిర నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్న శివసేన డిమాండ్‌ను కూడా మోదీ పట్టించుకోలేదు. కానీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ ప్రభుత్వం మందిర నిర్మాణానికి సానుకూల పరిణామాలు కలిగేలా తెరవెనుక చక్రం తిప్పినట్లు చెప్పుకుంటున్నారు.

దాంతో అయోధ్య అంశం కేవలం తెరవెనుక మంత్రాంగానికే పరిమితమై.. ఇప్పుడు క్రెడిట్ కూడా తీసుకోలేని పరిస్థితి బిజెపిది. అలాంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఇలా అయోధ్య తీర్పుతో బిజెపి నోటికి తాళం పడినట్లయ్యిందనడం ఆశ్చర్యం కలిగించక మానదు.