కేంద్రమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో ఇవాళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాతో సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో ఇవాళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాతో సమావేశమయ్యారు. ఈ సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ చేరుకున్న జగన్.. అమిత్షాను ఆయన నివాసంలో కలుసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం, కొవిడ్ సహా పలు కీలక అంశాలను అమిత్షాకు సీఎం వివరిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు, రాజధాని వికేంద్రీకరణ విషయంలో ఇటీవల కేంద్ర హోంశాఖ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ల అంశంపైనా నేతలిద్దరూ చర్చిస్తున్నట్లు సమాచారం. సీఎం జగన్ వెంటన వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కూడా సీఎం జగన్ సమావేశం కానున్నారు.