Bihar Politics: కమలం వైపు మరోసారి చూస్తున్న రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు.. బీహార్లో వ్యూహత్మకంగా పావులు కదుపుతున్న బీజేపీ..
బీహార్లో వ్యూహం మొదలు పెట్టింది కమలం. పక్కా ప్లాన్తో పావులు కదుపుతోంది. నితీష్ కుమార్తో దోసీ కటీఫ్ అవడంతో బీజేపీ పెద్ద ప్లాన్ వేస్తోంది. అక్కడి యువకులను ఆకట్టుకునేందుకు చక్రం తిప్పుతోంది.
బీహార్ సీఎం నితీష్కుమార్ను టార్గెట్ చేశారు కేంద్రమంత్రి అమిత్షా. టార్గెట్గా ముందుకు కదులుతున్నారు. నితీష్ -లాలూ మళ్లీ ఏకం కావడంతో బీహార్లో పక్కాగా ప్లాన్ చేస్తోంది బీజేపీ. ఇందులో భాగంగానే ఎల్జేపీతో స్నేహం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ యువ నాయకుడు, దివంగత మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడిని దగ్గరకు తీస్తోంది. జముయ్ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుదీర్ఘ సమావేశం తర్వాత బీహార్లోని రెండు స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) మాజీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన తర్వాత ఒక పెద్ద ప్రకటన చేసారు. నవంబర్ 3 రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తానని తేల్చి చెప్పారు.
చిరాగ్ పాశ్వాన్ తిరిగి ఎన్డీయేలోకి వస్తారా..?
ఉప ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి బేషరతు మద్దతు ప్రకటించి ఉండవచ్చు.. అయితే దీనితో అతను నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ)లో చేరడం లేదని స్పష్టం చేశారు. బీహార్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి బేషరతు మద్దతు ఉంటుందని.. అలా అని తాము ఎన్డీయేలో చేరబోతున్నామని దీని అర్థం కాదని చిరాగ్ అన్నారు.
దీనికి ఆయన మాట్లాడుతూ.. మొకామా, గోపాల్గంజ్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎల్జేపీ (రామ్విలాస్) మద్దతు ఇస్తోంది. బీహార్ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఎన్డీయే తీరు ఎలా ఉంటుందో చెప్పలేమని ఆయన అన్నారు. చిరాగ్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించిన పార్టీ ప్రత్యేక బృందానికి చీఫ్గా వ్యవహరిస్తున్నారు.
చిరాగ్ ఎన్డీయేకి ఎందుకు దూరం అయ్యారు..?
2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి చెందిన జనతాదళ్ (యునైటెడ్) (జెడియు)కి వ్యతిరేకంగా జముయికి చెందిన యువ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ తిరుగుబాటు చేశారు. బిజెపి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సహాయపడాలని అతను సంకల్పించాడు. అయితే బిజెపి తన మామ పశుపతి కుమార్ పరాస్ను కేంద్రంలో క్యాబినెట్లోకి చేర్చుకోవడంతో పార్టీ పట్ల అసంతృప్తి చెందాడు. మేనమామ, మేనల్లుడి మధ్య వివాదం తలెత్తడంతో పార్టీ చీలిక వచ్చింది.
అమిత్ షాతో టచ్లో ఉన్న యువ నాయకుడు
శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుదీర్ఘ సమావేశం తర్వాత 39 ఏళ్ల ఎంపీ చిరాగ్ పాశ్వాన్ ఢిల్లీ నుంచి పాట్నాకు చేరుకుని ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేస్తానని ప్రకటించారు. చిరాగ్ పాశ్వాన్ అమిత్ షాతో చాలా కాలంగా టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం