Minister Pralhad Joshi: మైనింగ్ రంగంలో సంస్కరణలకు కేంద్రం పెద్దపీట: మంత్రి ప్రహ్లాద్ జోషి
Minister Pralhad Joshi: మైనింగ్ రంగంలో సంస్కరణలకు కేంద్రం పెద్దపీట వేసింది. మైనింగ్ ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ఉపాధి కల్పన పెరగడానికి ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆత్మ నిర్భర్ భారత్ సాకారానికై..
Minister Pralhad Joshi: మైనింగ్ రంగంలో సంస్కరణలకు కేంద్రం పెద్దపీట వేసింది. మైనింగ్ ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ఉపాధి కల్పన పెరగడానికి ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆత్మ నిర్భర్ భారత్ సాకారానికై వంద ఖనిజాల బ్లాక్లను వేలానికి పెట్టింది. ఈ గనుల వేలం ప్రక్రియను కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, మైన్స్, బొగ్గు, రైల్వే సహాయమంత్రి రావు సాహెబ్ పాటిల్లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మైన్స్, బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. మైనింగ్ రంగంలో ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద పీట వేశారని, సహజ వనరులను వినియోగించుకోవడంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ వెనుకబడిందని, అందుకే సంస్కరణలను తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వం మైనింగ్ రంగంలో కొన్ని మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోందని అన్నారు. ప్రస్తుత సంవత్సరంలో ఈ రంగంలో సంస్కరణలు, కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయన్నారు. వంద ఖనిజ బ్లాక్ల నివేదికలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడం వల్ల దేశంలో ఖనిజాలు నిరంతరం సరఫరా అవుతాయని, మరిన్ని ఖనిజ బ్లాక్లను వేలంలోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత ఆదాయం లభిస్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
అయితే ఎంఎడీఆర్ సవరణ చట్టం ద్వారా 2015 ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ అలాగే మైనింగ్ లీజు చట్టాన్ని సవరించింది. ఈ చట్టం 2021లో మరింత సరళీకృతంగా మార్చారు. ఇటీవల చేసిన సవరణల ద్వారా మైనింగ్ రంగంలో పెట్టుబదులు అదేవిధంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా.. రాష్ట్రాల ఆదాయం కూడా ఈ సరళీకరణ వలన పెరుగుతుంది. ఈ చట్టాన్ని సరళీకృతం చేయడం ద్వారా రాష్ట్రాలు లీజు దారులను మార్చడం జరిగిన తరువాత మైనింగ్ కార్యకలాపాల్లో వేగం మందగించకుండా చూడగలుగుతాయి. అదేవిధంగా, ఖనిజ వనరుల అన్వేషణలో వేగం పెరుగుతుంది. కేంద్రం ఈ సవరణల ద్వారా మైనింగ్ వేలం వేగం పెంచాలని రాష్ట్రాలను కోరుతోంది.
ఈ సవరణతో, ‘ఆత్మ-నిర్భర్ భారత్’ విధానాన్ని మరింత పెంచేందుకు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భౌగోళికంగా 100 మైనింగ్ బ్లాక్లను వేలానికి పెట్టింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం ద్వారా దేశంలో ఖనిజాలు నిరంతరం సరఫరా అయ్యేందుకు వీలుంటుంది. మరిన్ని మైనింగ్ బ్లాక్ లను వేలంలోకి తీసుకురావడం వలన రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది.