
బెంగళూరు, జులై 10: నేటి సమాజంలో మానవ సంబంధాలు నానాటికీ దారుణంగా మసక బారుతున్నాయి. చిన్న కారణానికే భార్య భర్తను, భర్త భార్యను, పిల్లలు కన్న తల్లిదండ్రులను, కన్నోళ్లు పిల్లలను చంపుకుంటున్నారు. తాజాగా అలాంటి దారుణం మరొకటి చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల తల్లిని విచక్షణా రహితంగా కొట్టాడో దుర్మార్గపు భర్త. ఆపై ఆమెను కింద పడేసి ఆమె మెడపై కాలు పెట్టి తొక్కి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆమె మృతి చెందిందని నిర్ధారించుకునేంత వరకూ మెడపై కాలుతో తొక్కాడు. దంపతుల మధ్య జరిగిన గొడవ దారుణంగా కక్ష్య పెంచుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారనైంది. ఇద్దరు పిల్లల తల్లిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
కర్ణాటకలోని శ్రీనివాసపూర్లో హరీష్ కుమార్, పద్మజ దంపతులు కాపురం ఉంటున్నారు. హరీష్ కుమార్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత బెంగళూరుకి ఉద్యోగం రిత్య షిఫ్ట్ అయ్యారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. కొంతకాలం బాగానే ఉన్నా ఆ తర్వాత ఈ దంపతులు తరచుగా గొడవ పడసాగారు. ఈ క్రమంలో మంగళవారం (జులై 8) రాత్రి కూడా మరోమారు గొడవ పడ్డారు. హరీష్, పద్మజను కొట్టి, ఆపై నేలకేసి కొట్టాడు. అనంతరం ఆమె మెడపై తన కాలు వేసి ఆమె చనిపోయే వరకు తొక్కి హత మార్చాడు.
సమాచారం అందుకున్న బొమ్మనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడు హరీష్ను అరెస్టు చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యను హత్య చేసిన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు నిందితుడు హరీష్ను ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.