జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తివేత
శ్రీరామసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కి ఎగువున గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బుధవారం (జూలై 1న) ఎత్తనున్నట్లు ఎస్సారెస్పీ ఈఈ రామరావు తెలిపారు. ఈ నేపథ్యంలో...

శ్రీరామసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కి ఎగువున గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బుధవారం (జూలై 1న) ఎత్తనున్నట్లు ఎస్సారెస్పీ ఈఈ రామరావు తెలిపారు. ఈ నేపథ్యంలో నదీ పరీవాహక రైతులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తడం ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతీ ఏటా బాబ్లీ గేట్ల ఎత్తివేత, మూసివేతను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్ 30న అర్ధరాత్రి అంటే జూలై 1న ఇరు రాష్టాల్ర అధికారులు, కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు గేట్లను తెరుస్తారు. అక్టోబర్ 28 వరకు గేట్లను ఎత్తి ఉంచాల్సి ఉంటుంది.
కాగా, గద్వాల, రాయచూరు ప్రాంతాల్లో కరుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చిచేరింది. ఈ ఏడాది తొలిసారిగా వర్షాలతో 857 క్యూసెక్కుల నీరు ఈ ప్రాజెక్టుకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జూరాలో 9.66 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను సోమవారం 4.7 టీఎంసీల నీరు నిల్వ ఉందని వివరించారు.