Vijay Rupani: 1206 విజయ్ రూపానీ లక్కీ నంబర్ – కానీ అదే రోజున ఆయన దుర్మరణం

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు. 1206 అనే సంఖ్యను అదృష్ట నంబర్‌గా భావించిన విజయ్ రూపానీ, అదే సంఖ్య వచ్చే రోజున, జూన్ 12న జరిగిన ఈ దుర్ఘటనతో చనిపోయారు. ఆయన ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Vijay Rupani: 1206 విజయ్ రూపానీ లక్కీ నంబర్ - కానీ అదే రోజున ఆయన దుర్మరణం
Vijay Rupani

Updated on: Jun 13, 2025 | 1:39 PM

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఐతే.. ఈ సందర్భంగా.. ఆయన అదృష్ట సంఖ్యపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ఆయన 1206 అనే సంఖ్యను తన లక్కీ నంబర్‌గా భావించేవారు. విజ‌య్ రూపానికి సంబంధించిన అన్ని వాహ‌నాల నంబ‌ర్ కూడా 12/06 అని ఉంటుంది. కానీ అదే నంబర్ వచ్చే రోజున ఆయన చనిపోయారు. నిన్న జూన్ 12. అంటే.. 1206 వస్తుంది. దీంతో మాజీ సీఎం అదృష్ట సంఖ్య.. దుర‌దృష్టంగా మారిందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఉన్నారన్న వార్త ఆయన కుటుంబ సభ్యులను కలిచివేస్తోంది. ఆగస్ట్‌ 22 , 1956లో అప్పటి బర్మా రాజధాని రంగూన్‌లో జన్మించారు విజయ్‌ రూపానీ. అయితే బర్మాలో రాజకీయ సంక్షోభం కారణంగా ఆయన కుటుంబం 1960లో భారత్‌కు వలస వచ్చింది. గుజరాత్‌ లోని రాజ్‌కోట్‌లో స్థిరపడింది. ఎమర్జెన్సీ సమయంలో 11 నెలల పాటు జైల్లో ఉన్నారు. 1987లో రాజ్‌కోట్‌లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1996-1997 మధ్య రాజ్‌కోట్‌ మేయర్‌గా పనిచేశారు. 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

2014లో తొలిసారి రాజ్‌కోట్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన ఆనందీబెన్‌ పటేల్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2016లో గుజరాత్‌ బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టారు. 2016లో సీఎం పగ్గాలు చేపట్టారు విజయ్‌ రూపానీ. 2021 వరకు ఆయన సీఎం పదవిలో ఉన్నారు.  2021లో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్‌ సీఎం పదవిని చేపట్టారు. ఆయన సతీమణి అంజలి కూడా బీజేపీ మహిళా మోర్చాలో కీలక నేతగా ఉన్నారు.

విజయ్‌ రూపానీ మృతిని గుజరాత్ ప్రభుత్వం ధృవీకరించింది. లండన్‌లో ఉన్న కూతురు , భార్యను కలిసేందుకు ఆయన లండన్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదంలో గతంలో ఏపీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయారు. అరుణాచల్‌ సీఎం ఖందూ కూడా విమాన ప్రమాదంలోనే కన్నుమూశారు. గుజరాత్‌ మాజీ సీఎం బల్వంత్‌రాయ్‌ మెహతా కూడా 1965లో విమాన ప్రమాదం లోనే చనిపోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.