AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agnipath scheme: అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసనల జ్వాల.. 300 రైళ్లపై హింస ప్రభావం.. మొత్తం ఎంత నష్టం అంటే..!

Agnipath scheme: ఆందోళన, ధర్నా, నిరసన, రాస్తారోకో.. పేరేదైతేనేం? అంతిమంగా మిగిలేది నష్టమే. భారతీయుడికి కోపం వచ్చిందంటేచాలు..

Agnipath scheme: అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసనల జ్వాల.. 300 రైళ్లపై హింస ప్రభావం.. మొత్తం ఎంత నష్టం అంటే..!
Agnipath Scheme Protest
Shiva Prajapati
| Edited By: Team Veegam|

Updated on: Jun 18, 2022 | 11:40 AM

Share

Agnipath scheme: ఆందోళన, ధర్నా, నిరసన, రాస్తారోకో.. పేరేదైతేనేం? అంతిమంగా మిగిలేది నష్టమే. భారతీయుడికి కోపం వచ్చిందంటేచాలు.. రైళ్లు తగులబడాల్సిందే. రైల్వే ఆస్తులు మాడి మసి అవ్వాల్సిందే. కారణమేదైనా కసిదీరా రైళ్లను బుగ్గిచేయాల్సిందే. మరి సికింద్రాబాద్‌ హింసలో రైల్వేకు జరిగిన నష్టమెంత? మరి దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న అల్లర్లలో యావత్ రైల్వే శాఖకు వచ్చిన నష్టం ఎంత? అధికారులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

భారతీయుడికి కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా.. కోపమొచ్చినా.. బాధ కలిగినా.. అంతిమంగా నష్టం మాత్రం రైళ్లకే. ప్రజాస్వామ్య దేశంలో దశాబ్దాలుగా నిరసనల పేరుతో సాగుతున్న హింసకు దగ్ధమైన రైళ్లు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అది తెలంగాణ ఉద్యమమైతేనేం? నిరుద్యోగుల ఆగ్రహమైతేనేం? మానవహక్కుల పోరాటమైతేనేం? రాజకీయ ఆందోళనలైతేనేం? నష్టంమాత్రం రైళ్లపైనే. రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులకు దిగుతున్న నిరసనకారులు వందల కోట్లలో రైల్వేకు నష్టం చేకూరుస్తున్నారు.

కేంద్రం తెచ్చిన అగ్నిపథ్‌ స్కీంకు నిరసనగా దేశవ్యాప్తంగా పెల్లుబికిన అల్లర్లలో పదుల సంఖ్యలో రైళ్లు అగ్గికి బుగ్గికాగా.. మరికొన్ని రైళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, హర్యానాలో సాయుధ దళాల ఉద్యోగార్థులు చేసిన నష్టం అంతాఇంతా కాదు. నార్త్‌ ఇండియాకే పరిమితం అవుతుందనుకున్న హింస.. దక్షిణ భారతానికి పాకింది. సికింద్రాబాద్‌లో సాయుధ దళాల ఉద్యోగార్థుల ఆందోళనలో 30కి పైగాబోగీలు ధ్వంసమయ్యాయి. ఏడు రైలింజన్లు డ్యామేజ్‌ అయ్యాయి. రైల్వేస్టేషన్‌లోని స్టాళ్లు, ఎస్కలేటర్లు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ హింసలో పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.. ఆందోళనకారుల దాడుల్లో ఏడుగురు పోలీసులు సహా మరో 12మందిగాయపడ్డారు. సికింద్రాబాద్‌ ఘటనలో 2వేల మంది ఆందోళనలో పాల్గొని విధ్వంసం చేసినట్లు శాండల్య తెలిపారు. 30 కోట్లకుపైగా నష్టం జరిగిందన్నారు రైల్వే డీజీ సందీప్‌ శాండిల్య. నిరసనలు ప్రశాంతంగా తెలపాలని.. హింసకు పాల్పడడం సరికాదన్నారు.

ఇవి కూడా చదవండి

అగ్నిపథ్‌కు నిరసనగా దేశవ్యాప్తంగా చెలరేగిన హింసలో సుమారు 200 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు రైల్వే అధికారులు అంచనా వేశారు. 300 రైళ్లపై హింస ప్రభావం పడినట్లు వెల్లడించారు. 200 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. మొత్తంగా అగ్నిపథ్‌.. అగ్గిపథ్‌గా మారడంతో ప్రజాఆస్తులే ధ్వంసమవుతున్నాయి. ఇక ముందైనా రైళ్ల విధ్వంసం జరక్కుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని ప్రజా ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఉంది.