Water Commission : డేంజర్ లో 11 నదీ ప్రాంతాలు.. వార్నింగ్ లెవల్ మించి ప్రవహిస్తున్న ప్రాజెక్టులు..ట్విస్ట్ ఏంటంటే..?
వర్షాకాలం వచ్చేసింది. దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టులకు సంబంధించి నీటి మట్టాలతో పాటు ఇన్ ఫ్లో అంచనాలతో సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో 11 నదీ ప్రాంతాలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ప్రాజెక్టులు పూర్తిస్ధాయి నీటిమట్టానికి చేరుకోగా.. మరికొన్ని చోట్ల నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 11 నదీ ప్రాంతాలకు సంబంధించి నీటి మట్టాలు హెచ్చరిక స్థాయిని దాటాయని కేంద్ర జల కమిషన్ తెలిపింది. కానీ ముంపు ప్రమాదం ఏమి లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం 11 ప్రాజెక్టుల్లో నీటి మట్టం హెచ్చరిక స్థాయిలను దాటినప్పటికీ.. భారీ వరద వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పింది. అస్సాం, బీహార్, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లోని 12 ప్రదేశాలలో సాధారణం కంటే ఎక్కువ వరద ముంపు పరిస్థితులు ఉన్నట్లు వాటర్ కమిషన్ తెలిపింది. అస్సాం కరీంగంజ్లోని కుషియారా నది, జోర్హాట్లోని నీమతిఘాట్ వద్ద బ్రహ్మపుత్ర నది ఆందోళనకరమైన స్థాయికి చేరుకున్నట్లు నివేదిక విడుదల చేసింది.
బీహార్ బాల్తారా వద్ద కోసి, బెనిబాద్ వద్ద బాగ్మతి, దుమారియాఘాట్ వద్ద గండక్లో నీటి మట్టాలు పెరిగినట్లు వాటర్ కమిషన్ గుర్తించింది. ఉత్తరప్రదేశ్ లోని నాలుగు ప్రదేశాలను నిశితంగా పరిశీలిస్తోన్నట్లు తెలిపింది. వాటిలో ఫతేఘర్, కచ్లా వంతెన వద్ద గంగా, ఎల్గిన్బ్రిడ్జ్ వద్ద ఘాగ్రా, ఖడ్డా వద్ద గండక్ నదులు హెచ్చరిక స్థాయిలను దాటినట్లు జల కమిషన్ తెలిపింది. ఒడిశా బాలేశ్వర్ జిల్లాలోని మథాని రోడ్ బ్రిడ్జి, సుబర్ణరేఖలోని రాజ్ఘాట్ వద్ద సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నీటి మట్టాలు నమోదయ్యాయి. తమిళనాడులో, కావేరి నదిపై ముసిరి వద్ద నీటి మట్టం పెరిగిందని చెప్పింది. రుతుపవనాలు చురుకుగా ఉన్నప్పటికీ.. ఏ నదీ వాటి మునుపటి అత్యధిక వరద స్థాయిలను చేరుకోలేదని CWC తేల్చింది.
ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో సహా 10 రాష్ట్రాలలోని 23 ప్రదేశాలకు జలకమిషన్ ఇన్ఫ్లో అంచనాలను జారీ చేసింది. అల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రతో సహా కర్ణాటకలోని ప్రధాన జలాశయాలకు అధిక ఇన్ఫ్లో ఉంటుందని తెలిపింది. ఒడిశాలోని రెంగలి రిజర్వాయర్, పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ బ్యారేజీలకు సైతం భారీ ఇన్ఫ్లోలు ఉన్నట్లు తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..