యువతని నిర్వీర్యం చేస్తోన్న స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా.. తీవ్రమైన వ్యాధి బారిన పడుతున్న బాలికలు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు
కనీస అవసరాలు లేని ఇల్లు అయినా కనిపిస్తుందేమో కానీ.. స్మార్ట్ ఫోన్ ఫోన్ లేని మనిషి కనిపించడు అంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని మనుషులను ఏకం చేసింది.. అదే సమయంలో సొంత కుటుంబ సభ్యుల నుంచి దూరం చేసిందని చెప్పవచ్చు. యువత బానిసగా మారుతోందని అని ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాకు బానిస కావడం వల్ల టీనేజ్ అమ్మాయిల ఆరోగ్యం దెబ్బతింటోందని ఒక ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో యుక్తవయస్సులో ఉన్న బాలికల ఆరోగ్యంపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందనే వార్తలు తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. జిల్లాలోని మహిళా ఆసుపత్రిలో ఉన్న మోడల్ సాథియా సెంటర్ నుంచి వెలుగులోకి వచ్చిన డేటా ప్రకారం.. కౌమారదశలో ఉన్న బాలికలలో రుతుక్రమం సక్రమంగా జరగని కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం, శారీరక శ్రమ లేకపోవడం, అసమతుల్య ఆహారం దీనికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి జనవరి, ఫిబ్రవరిలో బరేలీలో 394 మంది టీనేజ్ బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిలో చాలా మందికి ముందస్తు లేదా ఆలస్యమైన ఋతుస్రావం సమస్య ఉంది. శరీరంలో హార్మోన్లు అసమతుల్యత కారణంగానే ఈ సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు. దీనికి కారణం శారీరక శ్రమ లేకపోవడం, అధికంగా మొబైల్ వాడకం, ఒత్తిడి, మారిన దినచర్య కావచ్చు.
10-12 ఏళ్ల వయస్సు బాలికలకు పీరియడ్స్
మోడల్ సాథియా సెంటర్ కౌన్సెలర్ అల్పనా సక్సేనా మాట్లాడుతూ.. ప్రస్తుతం 10-12 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలలో ఋతుస్రావం మొదలు అవుతుందని.. ఇలాంటి కేసులు ప్రతి నెలా 10 నుంచి 15 వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఇది బాలికల మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇటువంటి బాలికలకు సకాలంలో చెక్-అప్ చేయించుకోకపోవడం, ఆహారపు అలవాట్ల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం వంటి కారణాలతో కూడా రక్తహీనత ప్రమాదం పెరుగుతుందని చెప్పారు.
2024-25లో ఇటువంటి కేసులు పెరిగాయి
మోడల్ సాథియా సెంటర్ ప్రకారం గత సంవత్సరం నుంచి కౌమారదశలో ఉన్న బాలికలకు కౌన్సెలింగ్ కేసులు పెరుగుతున్నాయి
ఏప్రిల్ – 297
మే – 322
జూన్ – 308
జూలై – 253
ఆగస్టు – 202
సెప్టెంబర్ – 265
అక్టోబర్ – 207
నవంబర్ – 170
డిసెంబర్ – 200
జనవరి – 193
ఫిబ్రవరి – 201
నిపుణుల సలహాతో జీవనశైలిని మెరుగుపరచుకోండి
సీనియర్ గైనకాలజిస్ట్ , ప్రసూతి వైద్యురాలు డాక్టర్ మృదుల శర్మ ఇదే విషయంపై మాట్లాడుతూ.. టీనేజ్ అమ్మాయిలలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి అతిపెద్ద కారణం వారి దినచర్య సరిగా ఉండకపోవడమేనని అన్నారు. చదువు చదువు అంటూ ఒత్తిడి.. తగ్గిన శారీరక శ్రమ.. ఈ కారణాల వలన బాలికల్లో హార్మోన్లు అసమతుల్యమవుతున్నాయి.
ఏ కారణాల వల్ల ఋతుస్రావం ప్రభావితం కావచ్చు అంటే..
మొబైల్ ఫోన్ ని ఎక్కువగా ఉపయోగించడం
సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం
తగినంత శారీరక శ్రమ లేకపోవడం
అసమతుల్య ఆహారం.. ఆలస్యంగా భోజనం చేయడం
మానసికంగా తీవ్ర ఒత్తిడి, నిద్ర లేమి, క్రమరహిత నిద్ర
టీనేజర్లు ఏమి చేయాలో తెలుసా
బాలికల్లో పీరియడ్స్ సక్రమంగా వచ్చేందుకు.. వైద్యులు దినచర్యను సమతుల్యం చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, సమయానికి తినాలని, సోషల్ మీడియాలో తక్కువ సమయం గడపాలని సలహా ఇస్తున్నారు. రుతుక్రమంలో వచ్చే మార్పులను తేలికగా తీసుకోకండి. భవిష్యత్తులో ఎటువంటి తీవ్రమైన వ్యాధిని అయినా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది.. కనుక ఆరోగ్యంగా ఉండడం కోసం మంచి అలవాట్లు చేసుకోండి.. సకాలంలో వైద్యుడిని సంప్రదించండని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








