
వర్షాకాలంలో తేమ ఎక్కువవడం వల్ల పురుగులు, ఫంగస్ లాంటివి మొక్కల పెరుగుదలకు అడ్డుపడతాయి. వర్షం వల్ల మొక్కలు పచ్చగా ఉన్నా.. అదే సమయంలో వాటికి ఇబ్బందులు కూడా వస్తాయి. ఈ వర్షాకాలంలో మీ మొక్కలను బలంగా ఉంచడానికి ఈ చిట్కాలు పాటించండి.
మొక్కలకు నీరు అవసరమే కానీ వర్షాకాలంలో ఎక్కువ నీరు పోయకూడదు. ఎందుకంటే గాలిలో ఇప్పటికే తేమ ఎక్కువగా ఉంటుంది. నీరు పోసే ముందు మట్టిని చేత్తో తాకి చూడండి. పై మట్టి పొర పొడిగా ఉంటేనే నీళ్లు పోయండి.
కుండలోని మట్టిని అప్పుడప్పుడు కొంచెం వదులు చేయండి. దీని వల్ల మొక్క వేర్లు ఊపిరి తీసుకోగలుగుతాయి. గట్టిగా ఉన్న మట్టిలో తేమ ఎక్కువసేపు ఉండి వేర్లు కుళ్ళిపోతాయి.
వర్షాకాలంలో మొక్కలకు ఫంగస్ ఎక్కువగా వస్తుంది. అందుకే వర్షాలు రాక ముందే ఎండిన ఆకులు, కొమ్మలు తీసేయండి. మొక్కలను కత్తిరించడం వల్ల వాటికి గాలి బాగా తగిలి పురుగులు, ఫంగస్ రాకుండా ఉంటాయి.
హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటివి నీటిలో కలిపి మొక్కలపై స్ప్రే చేయండి. ఇది ఫంగస్ ను తగ్గిస్తుంది. 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తే మంచిది.
కుండీలో నీళ్లు నిలిచిపోతే వేర్లు కుళ్లిపోతాయి. అందుకే కుండీ కింద ఉన్న రంధ్రాలు మూసుకుపోకుండా చూసుకోండి. ఒకవేళ మట్టి అతుక్కుపోతే ఆ కుండీలో కొత్త మట్టితో మళ్లీ మొక్కను నాటండి.
వర్షాకాలంలో కుండీను పూర్తిగా మట్టి లేదా ఎరువు కలిపిన మట్టితో నింపండి. దీని వల్ల నీళ్లు కుండీ పైన నిలవకుండా ఉంటాయి. నీళ్లు నిలిచిపోతే పోషకాలు మొక్కకు అందవు. అలాగే దోమలు కూడా పెరుగుతాయి.
వర్షాకాలంలో మీ మొక్కలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే వాటికి సరిపడినంత శ్రద్ధ ఇవ్వడం చాలా అవసరం. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ మొక్కలు ఈ సీజన్ ను సులభంగా దాటేస్తాయి.