12 గ్లాసుల నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా..? అసలు నిజం ఏంటీ..?
ఎండలు దంచికొడుతున్నాయి.. ఈ వేసవిలో మీ గొంతు మాత్రమే కాదు, మీ కిడ్నీలు కూడా దాహంతో అల్లాడుతున్నాయి. శరీరంలో నీటి శాతం తగ్గగానే కిడ్నీలో రాళ్లు సైలెంట్గా చేరిపోతాయి. అయితే రోజూ 12 గ్లాసుల నీరు తాగితే ఆ రాళ్లు కరిగిపోతాయా? ఏ పరిమాణం వరకు రాళ్లు నీటితో బయటకు వస్తాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండలు ముదురుతున్న వేళ ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. వేసవిలో మన శరీరానికి నీటి అవసరం చాలా ఎక్కువ. అయితే ఈ కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేవలం నీళ్లు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లను వదిలించుకోవచ్చా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే, మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ వంటి లవణాలు పేరుకుపోయి రాళ్లుగా మారుతాయి. సాధారణంగా 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న రాళ్లు పుష్కలంగా నీరు తాగడం వల్ల మూత్రం ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రోజుకు కనీసం 10 నుండి 12 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలో మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మూత్రనాళంలో ఉన్న చిన్న చిన్న రాళ్లను ఒత్తిడితో బయటకు నెట్టడానికి సహాయపడుతుంది. తగినంత నీరు తాగడం వల్ల మూత్రం పలుచబడి కొత్తగా రాళ్లు ఏర్పడే ప్రక్రియ ఆగిపోతుంది.
నీరు సరిపోతుందో లేదో ఎలా తెలియాలి..?
మీరు తాగుతున్న నీరు శరీరానికి సరిపోతుందో లేదో మీ మూత్రం రంగు ద్వారా తెలుసుకోవచ్చు. మూత్రం రంగు పారదర్శకంగా లేదా లేత పసుపు రంగులో ఉంటే మీరు హైడ్రేటెడ్గా ఉన్నట్లు అర్థం. ఒకవేళ ముదురు పసుపు రంగులో ఉంటే, మీ శరీరంలో నీటి శాతం తగ్గిందని, కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతోందని గ్రహించాలి.
ఎప్పుడు జాగ్రత్త పడాలి..?
నీరు తాగడం అనేది కేవలం చిన్న రాళ్లకు, రాళ్లు పడకుండా నివారించడానికి మాత్రమే పని చేస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి.
రాళ్ల పరిమాణం: రాయి 6-7 మిల్లీమీటర్ల కంటే పెద్దదిగా ఉంటే, మీరు ఎంత నీరు తాగినా అది సహజంగా బయటకు రాకపోవచ్చు. దానికి వైద్య చికిత్స అవసరం.
తీవ్రమైన లక్షణాలు: విపరీతమైన కడుపు నొప్పి, వెన్నునొప్పి, వాంతులు అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు.
డేంజర్ బెల్స్: మూత్రంలో రక్తం పడటం లేదా చీము రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే యూరాలజిస్ట్ను సంప్రదించాలి.
వేసవిలో కేవలం నీటినే కాకుండా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటి ద్రవపదార్థాలను తీసుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించడం మేలు.
