కూరగాయల్లో అరటి కాయ కూడా ఒకటి. అరటి కాయ అంటే చాలా మంది తినరు. కానీ ఒక్కసారి ఇలా ఫ్రై చేసి పెడితే.. మళ్లీ కావాలని అడుగుతారు. ఈ పొడి ఫ్రై అంత రుచిగా ఉంటుంది. ఆరోగ్యానిక కూడా అరటికాయ చాలా మంచిది. మటన్లో ఉండే పోషక విలువలతో అరటికాయ సమానమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అరటి కాయలో ఫైబర్ శాతం ఎక్కువగా లభిస్తుంది. అరటి కాయ బజ్జీలు అంటే తింటారు. కానీ కూరలు తినడానికి ఇష్ట పడరు. సరిగ్గా వండితే కూరలు చాలా రుచిగా ఉంటాయి. ఈ అరటి కాయ పొడి ఫ్రైని తక్కువ సమయంలోనే చేయవచ్చు. మరి ఈ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
అరటి కాయలు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింత పండు, కొబ్బరి తురుము, బెల్లం, మినప పప్పు, ఎండు మిర్చి, ధనియాలు, సోంపు, ఆవాలు, కరివేపాకు, పల్లీలు, ఆయిల్.
ముందుగా మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకుని మినప పప్పు, ధనియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి వేయించాలి. చల్లారక పొడి చేసి పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా చింత పండు, కొబ్బరి తురుము, బెల్లం తురుము వేయాలి. ఆ తర్వాత అరటి కాయను చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు, పసుపు వేసిన నీటిలో వేయాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేయాలి. తాళింపులు, పల్లిలీలు వేసి చిటపటలాడాక.. ఎండు మిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఉల్లి, పచ్చి మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేయాలి. నెక్ట్స్ అరటి కాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత 10 నిమిషాలు వేయించాక.. మసాలా పొడి వేయాలి. మరో పది నిమిషాలు ఫ్రై చేయాలి. చివరగా కొత్తిమీర వేసి ఫ్రై దించేసుకోవడమే. ఈ ఫ్రై వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.