జనావాసాల్లో జింక కలకలం.. చెంగు చెంగు మంటూ.. రోడ్డుపై పరుగులు తీసిన వన్యప్రాణి!
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారంలో జనావాసాల మధ్య జింక ప్రత్యక్షమైంది. రహదారిపై పరుగులు తీసిన వన్యప్రాణిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వన్యప్రాణులు ఇలా గ్రామాలోకి వస్తే, వాటిని వెంబడించకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని స్థానికులు సూచిస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారం నుంచి కొయ్యలగూడెం వెళ్లే రహదారిపై జింక ప్రత్యక్షమైంది. అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన జింక కొద్దిసేపు పరుగులు తీస్తూ కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. జింకను చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపించారు. పలువురు తమ సెల్ఫోన్లలో జింక పరుగులు తీస్తున్న దృశ్యాలను వీడియోలు, ఫొటోలు తీశారు. కొంతసేపు రహదారిపై సంచరించిన జింక.. అనంతరం సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది.
సాధారణంగా అటవీ ప్రాంతాల్లో కనిపించే జింక జనావాసాల మధ్య, ప్రధాన రహదారిపై ప్రత్యక్షం కావడంతో స్థానికులు ఆసక్తిగా చర్చించుకున్నారు. దేవలమ్మనాగారం గ్రామ శివారులో రాచకొండ అటవీ ప్రాంతం ఉండటంతో.. అడవి నుంచి జింక గ్రామం వైపు వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. జింక కనిపించిన సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తే వాటిని వెంబడించకుండా, ఇబ్బంది పెట్టకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని స్థానికులు సూచిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
