AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్‌లో మహా విపత్తు.. రెస్క్యూలో భారత్ కీలకం.. 163 మంది భారతీయులు సురక్షితం.. !

నేపాల్‌లో సంభవించిన భారీ విపత్తు తర్వాత, భారత్ తక్షణమే రెస్క్యూ, సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 163 మంది భారతీయులను సురక్షితంగా రక్షించింది. సొరంగ రెస్క్యూ, ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దించి, చిక్కుకుపోయిన వారిని గుర్తించడంలోనూ, మృతదేహాలను గుర్తించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తోంది. నేపాల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, మానవతా దృక్పథంతో భారత్ అందిస్తున్న సహాయం ప్రశంసనీయం.

నేపాల్‌లో మహా విపత్తు.. రెస్క్యూలో భారత్ కీలకం.. 163 మంది భారతీయులు సురక్షితం.. !
Indians Rescued In Nepal
Balaraju Goud
|

Updated on: Sep 02, 2026 | 10:41 AM

Share

నేపాల్‌లో ప్రకృతి ప్రకోపం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన వేళ.. భారత్ భారీ స్థాయిలో సహాయక, రెస్క్యూ చర్యలను చేపట్టింది. నేపాల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించడంతో పాటు.. గల్లంతైన వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఇప్పటివరకు 163 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. గత సమాచారంతో పోలిస్తే తాజాగా మరో ఐదుగురిని రక్షించినట్లు MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

భారత్ చేపడుతున్న సహాయక చర్యల్లో సొరంగ రెస్క్యూ బృందం, ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం కీలకంగా పనిచేస్తున్నాయి. నేపాల్‌లోని చిలిమే ప్రాంతంలోని జలవిద్యుత్ సొరంగాల్లో చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించేందుకు భారత సొరంగ రెస్క్యూ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. సొరంగానికి ఉన్న ఇరుకైన ప్రవేశ మార్గం, క్లిష్టమైన భూభాగం, చిత్తడి నేల కారణంగా రెస్క్యూ సిబ్బందికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి.

సాధారణ పరికరాలను ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. భారత బృందం ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించింది. తాత్కాలికంగా తయారు చేసిన తేలియాడే పరికరాలను ఉపయోగిస్తూ సొరంగంలోకి మరింత లోతుగా వెళ్లింది. లోపల ఎవరైనా చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉండటంతో గాలింపు, రక్షణ చర్యలను మరింత ముమ్మరం చేసింది.

19 మందితో భారత ఫోరెన్సిక్ బృందం

భారీ సంఖ్యలో మృతదేహాలు లభ్యమవుతున్న నేపథ్యంలో మృతులను గుర్తించడం మరో పెద్ద సవాలుగా మారింది. దీనికోసం భారత్ నుంచి 19 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక ఫోరెన్సిక్ బృందం నేపాల్ చేరుకుంది. కాఠ్మండులో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ బృందం.. నేపాల్ అధికారులతో కలిసి DNA నమూనాల సేకరణ, పరీక్షలు, విశ్లేషణ చేపడుతోంది. భారత ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో నేపాల్‌లో DNA నమూనాల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడం ద్వారా గుర్తుతెలియని మృతదేహాలను త్వరగా గుర్తించే అవకాశం ఉంది. తద్వారా మృతుల కుటుంబాలకు సమాచారం అందించడంలో కూడా సహాయం లభించనుంది.

చైనా నుంచి 151 మంది భారతీయుల తరలింపు

నేపాల్‌తో పాటు చైనా నుంచి కూడా భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబర్ 1న చైనా నుంచి 151 మంది భారతీయులు బయలుదేరినట్లు MEA వెల్లడించింది. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. అవసరమైన సహాయం అందిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

నేపాల్‌లో పెను విషాదం

భారత్ సహాయక చర్యలు కొనసాగుతుండగా.. నేపాల్‌లో విపత్తు తీవ్రత మాత్రం ఆందోళనకరంగా ఉంది. ఆగస్టు 26న ఉత్తర, మధ్య నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు, మంచు, రాళ్లు కూలిపోవడం వంటి ఘటనలు అనేక పట్టణాలు, గ్రామాలను తీవ్రంగా దెబ్బతీశాయి. మంగళవారం (సెప్టెంబర్ 01) నాటికి మృతుల సంఖ్య 1,003కు చేరినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సుమారు 4,000 మంది గల్లంతైనట్లు, దాదాపు 12,000 మందిని రక్షించినట్లు నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ అథారిటీ వెల్లడించింది.

నేపాల్‌లోని ఎనిమిది జిల్లాల్లో భద్రతా దళాలు, స్థానిక సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రహదారులు, వంతెనలు దెబ్బతినడం, కొండ ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితులు రెస్క్యూ ఆపరేషన్‌కు సవాళ్లు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ చేపడుతున్న సహాయక చర్యలు మరింత కీలకంగా మారాయి. భారతీయుల రక్షణతో పాటు.. సొరంగాల్లో గాలింపు, మృతుల గుర్తింపు కోసం DNA పరీక్షలు, నేపాల్ అధికారులతో సమన్వయం వంటి బహుముఖ చర్యలను భారత్ కొనసాగిస్తోంది. రాబోయే రోజుల్లో మరింత మంది భారతీయుల ఆచూకీ, సొరంగాల్లో చిక్కుకున్న వారి పరిస్థితి, DNA పరీక్షల ద్వారా గుర్తించే మృతుల వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us