Konaseema: కోనసీమ జిల్లాలో అద్భుతం…150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన భారీ రావి చెట్టును కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డు విస్తరణలో భాగంగా చెట్టును తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో, స్థానికుల విజ్ఞప్తి మేరకు రీప్లాంటేషన్ ద్వారా మరోచోటికి తరలించాలని నిర్ణయించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశంపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చెట్టును పరిశీలించి, శాస్త్రీయ పద్ధతుల్లో సంరక్షిస్తామని హామీ ఇచ్చారు.
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా లో అద్భుత ఘటనకు అధికారులు శ్రీకారం చుట్టారు. మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామంలో సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన భారీ రావి చెట్టును పరిరక్షించేందుకు అడుగులు పడ్డాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవంగా భావించి పూజలు చేసే ఈ చారిత్రక వృక్షం, రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందారు. చెట్టును ధ్వంసం చేయకుండా రీప్లాంటేషన్ ద్వారా మరోచోటికి తరలించాలని కోరుతూ కొందరు యువకులు సోషల్ మీడియాలో పోరాటం చేశారు. ఈ అంశం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. తక్షణం స్పందించిన ఆయన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యే నేరుగా మొగలికుదురు గ్రామానికి వెళ్లి ఆ రావి చెట్టును పరిశీలించారు. గ్రామస్తులతో కూర్చుని మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. చెట్టును పూర్తిగా నరికివేయకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో రీప్లాంటేషన్ ద్వారా వేరే ప్రాంతానికి సురక్షితంగా తరలించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ.. 150 ఏళ్ల నాటి వృక్షాన్ని సంరక్షించడం అంటే కేవలం ఒక చెట్టును కాపాడటం కాదని, తరతరాల ప్రకృతి వారసత్వాన్ని భావితరాలకు అందించడమేనని స్పష్టం చేశారు. భారీ వృక్షాలు పర్యావరణ సమతుల్యతకు, పక్షులకు ఆవాసంగా, గాలి నాణ్యతను పెంచడంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అయితే, 150 ఏళ్ల వయస్సున్న ఈ భారీ చెట్టును రీప్లాంట్ చేయడం అనేది అంత సులభమైన ప్రక్రియ కాదని, చెట్టు వేర్ల వ్యవస్థ, బరువు, వృక్ష నిపుణుల పర్యవేక్షణ అత్యంత కీలకమని తెలిపారు. చారిత్రక వృక్షాలను నరికివేయడం కాకుండా వాటికి మరో జీవితం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా చేపట్టిన ఈ ప్రత్యేక చర్యపై మొగలికుదురు గ్రామస్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tirupati: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
ATM Robbery: పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు గ్యాస్ కట్టర్తో ఏటీఎంను బద్దలు కొట్టి
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
ChatGPTలో ఇదొక సీక్రెట్ ఫీచర్.. ఫోటోతో స్టిక్కర్ చేయడం ఇంత ఈజీనా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

