AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో దేవుడా.. చేతి గోరింటాకు చెదిరేలోపే ఊహించని విషాదం.. అసలేం జరిగిందంటే..?

పెళ్లి పీటలెక్కి మూడు నెలలు కూడా గడవలేదు.. చేతులకు పెట్టిన మెహందీ రంగు కూడా పూర్తిగా చెరిగిపోలేదు. అంతలోనే ఆ నవవధువు జీవితం అదనపు కట్నం పిశాచికి బలైపోయింది. అత్తింటి వారి వేధింపులు రోజురోజుకూ హద్దులు దాటడంతో ఆ మానసిక క్షోభను తట్టుకోలేక పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో ఊహించని నిర్ణయం తీసుకుంది..

Telangana: అయ్యో దేవుడా.. చేతి గోరింటాకు చెదిరేలోపే ఊహించని విషాదం.. అసలేం జరిగిందంటే..?
Woman Takes Her Own Life 3 Months After Marriage
Krishna S
|

Updated on: Sep 02, 2026 | 11:03 AM

Share

పెళ్లి జరిగి మూడు నెలలు కూడా గడవలేదు.. అప్పుడే అదనపు కట్నం రూపంలో ఆ నవవధువు పాలిట మృత్యువు ముంచుకొచ్చింది. అత్తింటి వారి వేధింపులను భరించలేక ఓ ఇరవై ఏళ్ల యువతి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన తెలంగాణలోని కొత్తకోట మండలంలో తీవ్ర కలకలం రేపింది. దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన దుస్తుల వ్యాపారి మల్లేష్‌తో, కొత్తకోట మండలం కనిమెట్టకు చెందిన పద్మమ్మ, వెంకటయ్యల కుమార్తె ఉషారాణి వివాహం జూన్ 25న వైభవంగా జరిగింది. ఈ సంబంధం కుదిరిన సమయంలో వధువు తరఫున ఆరు తులాల బంగారంతో పాటు రూ.2 లక్షల నగదును కట్న కానుకల కింద ముట్టజెప్పారు.

రూ.20లక్షలు తేవాలంటూ..

ఈ నేపథ్యంలో ఆనందంగా సాగాల్సిన కొత్త కాపురంలో నెల రోజులు తిరక్కుండానే వరకట్న వేధింపుల రూపంలో చిచ్చు రగిలింది. భర్త మల్లేష్‌తో పాటు అత్తామామలు అంజిలమ్మ, హనుమంతు కలిసి ఉషారాణిని వేధించడం ప్రారంభించారు. గడచిన నాలుగు రోజులుగా ఈ హింస మరింత హద్దుమీరింది. వ్యాపారం లేదా ఇతర అవసరాల నిమిత్తం పుట్టింటి నుంచి అదనంగా రూ.20 లక్షల నగదు తీసుకురావాలంటూ ఆమెపై తీవ్రస్థాయిలో మానసిక ఒత్తిడి తెచ్చారు.

ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో..

అత్తింటి వారి నిరంతర వేధింపులను తట్టుకోలేకపోయిన బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురైంది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో కనిమెట్టలోని పుట్టింటికి చేరుకున్న ఆమె, ఇంట్లో ఎవరూ లేని అదను చూసి బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటనపై మృతురాలి తల్లి పద్మమ్మ అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పెళ్లయిన కొద్దిరోజులకే కన్నబిడ్డ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

Follow Us