AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వడదెబ్బను మించి.. ఎండాకాలంలో ఫోన్ ఎక్కువ వాడితే ఏమవుతుందో తెలుసా..?

ఉదయం లేచింది మొదలు రాత్రి కళ్లు మూసే వరకు.. మన ప్రపంచం మొత్తం ఈ ఐదు అంగుళాల స్క్రీన్ లోనే ఆగిపోయింది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో సెల్ ఫోన్ వాడకం ఒక వ్యసనంలా మారి మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తోందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు డాక్టర్లు ఎందుకు హెచ్చరిస్తున్నారు? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వడదెబ్బను మించి.. ఎండాకాలంలో ఫోన్ ఎక్కువ వాడితే ఏమవుతుందో తెలుసా..?
Smartphone Health Risks In Summer
Krishna S
|

Updated on: Apr 05, 2026 | 1:27 PM

Share

భానుడి భగభగలకు తోడు స్మార్ట్‌ఫోన్ల సెగ తోడైతే ఆరోగ్యం చిక్కుల్లో పడక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వేసవిలో బయట తిరిగితే వడదెబ్బ తగులుతుందని భయపడతాం. కానీ ఇంట్లోనే ఉండి గంటల తరబడి సెల్‌ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల కూడా అంతే స్థాయి ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎండల వల్ల గాలిలో తేమ తగ్గి కళ్లు త్వరగా పొడిబారుతాయి. ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్ల నుంచి వెలువడే బ్లూ లైట్ కంటిపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల దృష్టి లోపాలు, కళ్లు ఎర్రబడటం, నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట చీకటిలో ఫోన్ వాడటం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గి తీవ్రమైన నిద్రలేమికి దారితీస్తోంది.

రెట్టింపు వేడి.. డీహైడ్రేషన్ ముప్పు

వేసవిలో బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు ఫోన్‌ను గంటల తరబడి వాడటం లేదా ఛార్జింగ్ పెట్టి గేమింగ్ ఆడటం వల్ల మొబైల్ నుంచి వెలువడే వేడి శరీర ఉష్ణోగ్రతను మరింత పెంచుతుంది. ఇది తెలియకుండానే మనల్ని నీరసానికి గురిచేస్తుంది. ఫోన్ వ్యసనంలో పడి సరిగ్గా నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తి వడదెబ్బ తగిలే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

డిజిటల్ వ్యసనం.. మానసిక ఆందోళన

సోషల్ మీడియాలో గడిపే ప్రతి నిమిషం మీ మెదడుపై భారాన్ని పెంచుతుంది. బయట ప్రకృతితో గడపకుండా, నాలుగు గోడల మధ్యే ఫోన్‌తో గడపడం వల్ల శారీరక శ్రమ శూన్యమవుతోంది. దీనివల్ల శరీరంలో జీవక్రియల వేగం తగ్గి, ఊబకాయం, మానసిక అలసట పెరుగుతాయి. ఫోన్ వాడకం ఒక వ్యసనంగా మారి, చిన్న విషయాలకే చిరాకు, కోపం రావడం వంటి మార్పులు సంభవిస్తాయి.

ఇవి పాటిద్దాం

20-20-20 రూల్: ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడటం ద్వారా కంటి ఒత్తిడిని తగ్గించవచ్చు.

డిజిటల్ డిటాక్స్: రాత్రి నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్‌ను పక్కన పెట్టేయండి.

హైడ్రేషన్: ఫోన్ వాడుతున్నా సరే, పక్కనే నీళ్ల బాటిల్ ఉంచుకుని ప్రతి అరగంటకు ఒకసారి నీరు తాగుతూ ఉండాలి.

శారీరక శ్రమ: సాయంత్రం వేళల్లో చల్లని వాతావరణంలో నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల మానసిక ఉత్సాహం పెరుగుతుంది.

వేసవి సెలవుల్లో పిల్లలు, యువత సెల్‌ఫోన్లకే పరిమితం కాకుండా క్రీడలు, పుస్తక పఠనం వంటి అలవాట్లపై దృష్టి సారించాలని నిపుణులు కోరుతున్నారు. గుర్తుంచుకోండి.. ఫోన్ మీ అవసరాల కోసం మాత్రమే, అది మీ ఆరోగ్యాన్ని బలితీసుకోకూడదు.

Follow Us