
విధి..ఎవరితో ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో చెప్పలేం. ఇప్పుడు అలానే ఓ యువ జంటను విడదీసింది. ఆ దంపతులకు సంవత్సరం క్రితమే పెళ్లయింది. కోటి ఆశలతో దాంపత్యం జీవితం సాగిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోని వారి కుటంబంలో మరో బుల్లి సభ్యుడు జతకాబోతున్నాడు. కానీ ఆ ఆనందాన్ని రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేసింది. భార్యను చూసేందుకు పయనమైన అతను మృత్యు ఒడిలోకి జారిపోయాడు. ఈ హృదయాన్ని ద్రవించే ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. నరసన్నపేట మండలం దూకులపాడు గ్రామంలో నివశించే అల్లు అమ్మ నాయిడు.. విశాఖ జిల్లా యలమంచిలి దగ్గర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పన్నెండేళ్లుగా మెకానికల్ ఇంజినీర్గా వర్క్ చేస్తున్నాడు. ఆయనకు ఓ యువతితో గతేడాది పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. ఆమెకు ఈ నెల 8న ప్రసూతి సమయంగా డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తన భార్య దగ్గర ఉండాలని అమ్మ నాయుడు ఆదివారం ఉదయం యలమంచిలి నుంచి మోటారు వాహనంపై సొంతూరు దూకులపాడుకు బయల్దేరాడు. దారిలో వస్తుండగా విజయనగరం జిల్లా భోగాపురం-పూసపాటిరేగ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అమ్మ నాయుడు మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గర్భవతి అయిన అతని భార్య రోదించిన తీరు స్థానికుల మనసులను కదిలించింది.