ప్రేక్షకులు లేని మ్యాచ్లపై కోహ్లి ఏమన్నారంటే…
ప్రేక్షకులు ఆటలో ప్రధాన భాగమే. కానీ మనం ఆడేది అందుకోసం కాదన్న కోహ్లీ.. అభిమానులు లేని ఖాళీ స్టేడియాల్లో ఆడడం వల్ల తమ ఆటపై ఎలాంటి ప్రభావం పడదని స్పష్టం చేశారు.
ఐపీఎల్ అంటే ఫుల్ జోష్.. ఫుల్ ఎంటర్ టెన్మెంట్.. అటు ఆటగాళ్లతో పాటు ఇటు అభమానులకు ఉత్సాహాన్ని నింపుతుంది. సిక్సర్లు, ఫోర్ల మోతతో పొట్టి క్రికెట్ హోరెత్తుతుంది. అభమానుల సందడి మధ్య జరిగే ఈ 20-20 అంటే హుషారు ఉంటుంది.. అభిమానుల ప్రోత్సహం నడుమ ఆటగాళ్లు మరింత రెచ్చిపోయి పిచ్చబాదుడుతో స్కోర్ బోర్డును ఉరకలెత్తిస్తుంటారు.. అలాంటి కరోనా మహమ్మారి దెబ్బకు చప్పబడింది. ఏకంగా దేశంలో జరగాల్సిన క్రికెట్ కాస్త.. ఎక్కడే ఏడారి ప్రాంతానికి తరలిపోయింది. అభిమానుల చప్పట్లు, ఈలలు, కేరింతలు లేకుండానే నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
అయితే, తమ ఆటగాళ్లు బయో బబుల్ను ఆమోదించారని, ఈ వాతావరణం నుంచి బయటపడితే బాగుండన్న భావన వారిలో లేదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. కొవిడ్-19 హీరోలను గౌరవించడం కోసం నిర్వహించిన వర్చువుల్ మీడియా సమావేశంలో కోహ్లి మాట్లాడాడు. బయో బబుల్ను అంగీకరించి ఉండకపోతే చుట్టూ ఉన్న పరిస్థితులను తలచుకుంటూ విచారిస్తూ ఉండేవాళ్లమన్నారు. కానీ ఇప్పుడు ఆ అలాంటి పరిస్థితులు లేవన్నారు కోహ్లీ. ప్రేక్షకులు లేకుండా ఆడటం అంటే చిత్రమైన భావం కలిగిందని కోహ్లీ… ప్రాక్టీస్ మ్యాచ్ల తర్వాత ఆ భావం పోయిందన్నారు. ప్లేయర్లు అందరూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మలుచుకుంటున్నారని, అందరం ఆట పట్ల ప్రేమతో ఆడుతున్నామన్నారు. ప్రేక్షకులు ఆటలో ప్రధాన భాగమే. కానీ మనం ఆడేది అందుకోసం కాదన్న కోహ్లీ.. అభిమానులు లేని ఖాళీ స్టేడియాల్లో ఆడడం వల్ల తమ ఆటపై ఎలాంటి ప్రభావం పడదని స్పష్టం చేశారు.
‘మై కొవిడ్ హీరోస్’ జెర్సీలతో..: కొవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో ముందు నడుస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు తదితరుల గౌరవార్థం బెంగళూరు ఆటగాళ్లు ఐపీఎల్ టోర్నీ ఆసాంతం ‘‘మై కొవిడ్ హీరోస్’’ అని రాసి ఉన్న జెర్సీలను ధరించనున్నారు. ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్లో ఆటగాళ్లు ధరించిన జెర్సీలను వేలం వేసి, వచ్చే మొత్తాన్ని గివ్ ఇండియా ఫౌండేషన్కు ఇవ్వనున్నట్లు ఆర్సీబీ తెలిపింది.