వాయులీన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి
సుప్రసిద్ధ వాయులీన విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ కన్నుమూశారు.. ఆయన మరణంతో సంగీత ప్రపంచానికి తీరని లోటు.. కర్ణాటక సంగీతంలో వయోలిన్ త్రిమూర్తులలో ఒకరైన కృష్ణన్ గత రాత్రి చెన్నైలో మరణించారు.
సుప్రసిద్ధ వాయులీన విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ కన్నుమూశారు.. ఆయన మరణంతో సంగీత ప్రపంచానికి తీరని లోటు.. కర్ణాటక సంగీతంలో వయోలిన్ త్రిమూర్తులలో ఒకరైన కృష్ణన్ గత రాత్రి చెన్నైలో మరణించారు. లాల్గుడి జీ జయరామన్, ఎమ్ఎస్ గోపాలకృష్ణన్లు ఏడేళ్ల కిందటే కాలధర్మం చేశారు.. కేరళలోని తిరుపణిత్తూరులో 1928, అక్టోబర్ 6న జన్మించిన తిరుపణిత్తూరు నారాయణ అయ్యర్ కృష్ణన్ చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి అభిరుచి పెంచుకున్నారు. నాలుగేళ్ల పసిప్రాయంలోనే తండ్రి నారాయణన్ అయ్యర్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. పదకొండేళ్ల వయసులోనే కచేరీలు చేశారు.. బాల్యంలోనే ఆనాటి సంగీత ద్రష్టలు అరైకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యానాధ బాగవతార్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, ఎమ్డి రామనాథన్, అళత్తూర్ సోదరులు వంటి వారి గాత్ర కచేరీల్లో వారి సరసన వయోలిన్ వాయించారు.. వాయులీనంలో మరిన్ని సంగతులు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో 1942లో మద్రాస్కు వచ్చారు. అక్కడ శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ను కలుసుకున్నారు. శెమ్మంగుడి శిక్షణలో కృష్ణన్ మరింత రాటుదేలారు.. అన్నట్టు కృష్ణన్ మద్రాస్లో ప్రముఖ పారిశ్రామికవేత్త అయ్యదురై ఇంట్లోనే ఉన్నారు. అయ్యదురై దంపతులు కృష్ణన్ను కన్న బిడ్డలా చూసుకున్నారు. వాయులీనంలో పేరు ప్రఖ్యాతులను గడించిన కృష్ణన్ సంగీతంలో అనేక ప్రయోగాలు చేశారు.. మద్రాస్ సంగీత కళాశాలలో ప్రొఫెసర్గా, అనంతరం యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ డీన్గా బాధ్యతలను నిర్వర్తించారు. దేశ విదేశాలలో అనేక కచేరీలు ఇచ్చారు. హిందుస్తానీ విద్వాంసులు ఉస్తాద్ అమ్జద్ అలీఖాన్, జాకీర్ హుస్సేన్ వారితో కలిసి చేసిన జుగల్బందీలు శ్రోతలను అమితంగా ఆకట్టుకున్నాయి.. టి.ఎన్.కృష్ణన్ సోదరి ఎన్.రాజం కూడా వయోలిన్ విద్వాంసురాలే. భారత ప్రభుత్వం 1973లో కృష్ణన్ను పద్మశ్రీతో, 1992లో పద్మభూషణ్తో సత్కరించింది.