అమెరికాలో కోవిడ్ 19 విజృంభణ, ఒక్క రోజులో సుమారు 4 వేల మంది మృతి, ఇంకా ముప్పు ఉందంటున్న నిపుణులు
అమెరికాలో ఒక్కరోజే (బుధవారం) 3,900 మందికి పైగా కోవిడ్ 19 రోగులు మరణించారని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ ప్రకటించింది. ఇటీవలి వరకు కొద్దిగా తగ్గుముఖం పట్టిందనుకున్న కోవిడ్ మళ్ళీ ప్రబలమైందని ఈ సంస్థ వెల్లడించింది.
అమెరికాలో ఒక్కరోజే (బుధవారం) 3,900 మందికి పైగా కోవిడ్ 19 రోగులు మరణించారని జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ ప్రకటించింది. ఇటీవలి వరకు కొద్దిగా తగ్గుముఖం పట్టిందనుకున్న కోవిడ్ మళ్ళీ ప్రబలమైందని ఈ సంస్థ వెల్లడించింది. తాజాగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 19,715,899 కి చేరగా కొత్తగా 189,671 కేసులు నమోదైనట్టు ఈ యూనివర్సిటీ పేర్కొంది. ఇప్పటివరకు 3 లక్షల 41 వేలమందికి పైగా కోవిడ్ రోగులు మృత్యువాత పడ్డారు. రానున్న వారాల్లో మరణాలు, కేసుల సంఖ్య మరింత పెరగవచ్చునని అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫాసీ ఆందోళన వ్యక్తం చేశారు. హాలిడేస్ రోజుల్లో జనసందోహాలు ఎక్కువగా ఉంటున్నందున ఈ ప్రమాదం ఉండే అవకాశం ఉందన్నారు. కాగా అమెరికాలో ఇంతవరకు సుమారు 30 లక్షల మందికి పైగా ప్రజలు కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నారని, ఇంకా ప్రస్తుతానికి 2 కోట్ల మంది వ్యాక్సినేషన్ జరగాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అమెరికాకు మరిన్ని కోట్ల డోసుల ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ అందజేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. అటు-మోడెర్నా, ఫైజర్, బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ల మాదిరి కాక.. ఆస్ట్రాజెనికా ,ఆక్స్ఫర్డ్ టీకామందులను మరీ తక్కువ టెంపరేచర్లలో నిల్వ చేయనక్కరలేదని, సాధారణ ఫ్రిజ్ కండిషన్ లో ఉంచితే చాలునని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని సులభంగా రవాణా చేయవచ్చు..చౌకైనది కూడా అని వారు తెలిపారు. చైనాలోని సైనోఫామ్ సంస్థ తమ వ్యాక్సిన్ 79 శాతం నాణ్యమైనదని పేర్కొంది.