AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇచ్చింది గోరంత.. ప్రకటన కొండంత

ప్యాకేజీపై విమర్శల వెల్లువ భగ్గుమంటున్న రాష్ట్రాలు కోవిడ్‌ నిర్వహణలో మసకబారుతున్న ప్రతిష్ట కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై భిన్నస్వరాలు ప్రతిధ్వనిస్తున్నాయి. అన్ని వర్గాలకు న్యాయంచేస్తూ.. మార్కెట్లో సరికొత్త అవకాశాలు అందిపుచ్చుకునేలా ప్యాకేజీ ఉందంటోంది BJP ప్రభుత్వం. ఆకలితో అలమటిస్తుంటే ప్రజలకు రూపాయి ఇవ్వకుండా రిఫామ్స్‌ పేరుతో పేదల పొట్ట కొట్టారంటోంది కాంగ్రెస్. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని ఎంత సమర్ధించుకుంటున్నా.. కీలకరంగాల ప్రతినిధులు కూడా పెదవి విరుస్తున్నారు. ఆటో, రిటైల్‌, ట్రావెల్‌, హోటల్‌ రంగాలను పూర్తిగా […]

ఇచ్చింది గోరంత.. ప్రకటన కొండంత
Ravi Kiran
|

Updated on: May 18, 2020 | 11:10 PM

Share
  • ప్యాకేజీపై విమర్శల వెల్లువ
  • భగ్గుమంటున్న రాష్ట్రాలు
  • కోవిడ్‌ నిర్వహణలో మసకబారుతున్న ప్రతిష్ట

కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై భిన్నస్వరాలు ప్రతిధ్వనిస్తున్నాయి. అన్ని వర్గాలకు న్యాయంచేస్తూ.. మార్కెట్లో సరికొత్త అవకాశాలు అందిపుచ్చుకునేలా ప్యాకేజీ ఉందంటోంది BJP ప్రభుత్వం. ఆకలితో అలమటిస్తుంటే ప్రజలకు రూపాయి ఇవ్వకుండా రిఫామ్స్‌ పేరుతో పేదల పొట్ట కొట్టారంటోంది కాంగ్రెస్. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని ఎంత సమర్ధించుకుంటున్నా.. కీలకరంగాల ప్రతినిధులు కూడా పెదవి విరుస్తున్నారు. ఆటో, రిటైల్‌, ట్రావెల్‌, హోటల్‌ రంగాలను పూర్తిగా విస్మరించినట్టు ఆరోపణలున్నాయి. డిమాండ్‌ పెంచి… ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడేందుకు ఫిస్కల్‌ బెన్‌ఫిట్‌ ఇస్తే బాగుండేదంటున్నారు. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాలకు పెద్దపీటవేశామని.. ఉపాథి అవకాశాలు సృష్టించే ప్రయత్నం చేశామంటున్నారు ఆర్థికమంత్రి నిర్మల.

వాస్తవానికి 20లక్షల కోట్లతో ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ప్రకటిస్తామని మోదీ చేసిన ప్రకటన 130 కోట్లమంది జనాల్లో ఆశలు రేకెత్తించింది. కోవిడ్‌ మహమ్మారి తెచ్చిన కష్టంతో ఆర్థికంగా చితికిపోయిన వలసకూలీల నుంచి బడా వ్యాపారవేత్తల వరకూ అందరిలో ఒక్కసారి ప్రాణం లేచివచ్చినట్టైంది. GDPలో 10శాతం ప్యాకేజీ అనడంతో.. మార్కెట్లో డిమాండ్‌ సృష్టించడానికి క్యాష్‌ స్కీములు ఉంటాయని ఊహించారు నిపుణులు. హెలికాప్టర్‌ మనీ.. క్వాంటటేటీవ్‌ ఈజింగ్‌ వంటి చర్యలు తీసుకుంటారని అంచనా వేశారు. కానీ ఇందుకు భిన్నంగా ప్రభుత్వం ప్రకటించిన 20లక్షల 97వేల కోట్ల ప్యాకేజీలో ప్రభుత్వం ఖర్చు చేస్తోంది సుమారు 2లక్షల కోట్లు మాత్రమే. ఇందులోనూ సగం రానున్న రెండుమూడేళ్లకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికలున్నాయి. మిగిలినదంతా RBI విధించిన మారిటోరియం, రెపోరేట్‌ లెక్కలే చూపించారు. అవే 8లక్షల కోట్లకుపైగానే ఉన్నాయి. మోదీ చెప్పినట్టుగానే మే 13 నుంచి వరుసగా 5రోజుల పాటు ప్యాకేజీలు ప్రకటించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. కానీ ఎవరికీ ఇవి రుచించలేదు. పైగా విమర్శల పాలయ్యాయి.

ఇది ముమ్మూటికీ ప్రజలను మోసం చేయడమేనంటున్నాయి విపక్షాలు. ప్రజలు ఆకలితో చనిపోతుంటే… వారి బలహీనతను ఆసరాగా చేసుకుని.. ఒక్కరు లేదా ఇద్దరు వ్యక్తులు తాము అనుకున్న నిర్ణయాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం. అంతేకాదు… కీలకమైన డిఫెన్స్, అంతరిక్షం, డిస్కమ్‌, మైన్స్‌ వంటి రంగాల్లో రిఫామ్స్‌పై చట్టసభల్లో చర్చించకుండా బైపాస్‌ చేసి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది కాంగ్రెస్‌. కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు బెంగాల్‌ సీఎం మమత. రాష్ట్రాలు తమ రుణపరిమితిని పెంచుకునేందుకు కేవలం 0.5 శాతం మాత్రమే అనుమతిచ్చారు. ఊకదంపుడు ప్రసంగంతో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ దేశప్రజలను తీవ్ర నిరాశకు గురిచేశారని కేసీఆర్‌ ఓ అడుగు ముందుకేసి ఇంత పనికిమాలిన ప్యాకేజీ ఎక్కడా ఇవ్వరన్నారు. దగా బోగస్‌ అంటూ మండిపడ్డారు. డిస్కంల ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్రాల అధికారాలను లాక్కునేందుకు కేంద్రం కుట్రం చేస్తోందని మండిపడ్డారు. అంతా ప్రైవేటీకరణ చేయడం కోసం ప్యాకేజీ ప్రకటించడం ఏంటని నిలదీశాయి రాష్ట్రాలు. కష్టాల్లో ఉన్న ప్రజలకు లక్ష కోట్లు కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రాలకు అప్పులు చేసుకుని కూడా సంస్కరణలు అమలు చేయాలంటూ సవాలక్ష ఆంక్షలు పెట్టడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.

రాష్ట్రాలు విమర్శలు చేయడానికి కారణాలు లేకపోలేదు. అమెరికా వంటి దేశాల్లో కూడా రాష్ట్రాలకు ఫెడరల్‌ ద్వారా నిధులు మళ్లాయి. ప్రజలను కష్టంలో ఆదుకున్నాయి. అమెరికా నుంచి ఐర్లాండ్‌ దాకా ఎన్నో దేశాలు సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆయా దేశాలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేశాయి. కానీ మనదగ్గర కేవలం అకౌంట్లలో 5వందల చొప్పున ఖాతాల్లో వేస్తామని చేతులు దులుపుకుంది కేంద్రం. పెట్రోలియం ఉత్పత్తుల్లో లక్షల కోట్లు ఎక్సైజ్‌ డ్యూటీ వచ్చినా పేదలను ఆదుకోవడానికి కేంద్రానికి చేతులురాకపోవడంపై ఆర్థిక వేత్తలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. దేశీయంగానే కాదు.. అంతర్జాతీయ సంస్థలు సైతం ఆర్థిక ప్యాకేజీపై విమర్శలు చేస్తూ ఎడిటోరియల్స్‌ రాయడం గమనార్హం.

పేదలకు కోట్ల పనిదినాలు కల్పించడానికి తీసుకున్న చర్యలు కాంగ్రెస్‌ నాయకులకు కనిపించడంలేదా అంటోంది BJP. వ్యవసాయ రంగంలో లక్ష కోట్లతో ఇన్‌ఫ్రా డెవలప్‌ చేయడంతో పాటు ప్రధానమంత్రి మత్య్ససంపద యోజనా పథకం గుర్తుచేస్తున్నారు కమలనాథులు. స్వావలంబనతో అవకాశాలను అందిపుచ్చుకుని గ్లోబల్‌ లీడర్‌గా ఎదగాలన్న ఆకాంక్షలకు అనుగుణంగా ప్యాకేజీ ఉందంటున్నారు BJP నాయకులు. కానీ ఎక్కడా మాటలకు తగ్గ చేతలు కనిపించడం లేదు. కంపెనీలకు అమ్ముతామనడం… ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న ఇస్రో, డిఫెన్స్‌ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించడంపై ప్రతిఒక్కరూ విమర్శలు చేస్తున్నారు. ప్రజలు కష్టంలో ఉంటే ఆదుకోకుండా… ఇలా దేశాన్ని అమ్మకానికి పెడతారా అని వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వలస కార్మికుల విషయంలో ప్రపంచం ముందు నవ్వుల పాలైన పాలకులు మరోసారి ఆర్థిక ప్యాకేజీ విషయంలో కూడా అదే చేశారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ప్యాకేజీ అంటే నిధులు రూపంలో నేరుగా ఇవ్వాల్సిన ప్రభుత్వం.. లక్ష కోట్ల కూడా ఇవ్వకుండా 20లక్షల కోట్లు అనడం ఆశ్చర్యానికే కాదు.. మోదీ ప్రభుత్వానికే సాధ్యమని అంటున్నారు మరి ఈ విమర్శలకు సమాధానంతో మరోప్యాకేజీతో వస్తారా? చూడాలి.

Follow Us