ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించగలరా..
ఆన్లైన్లో డిగ్రీ,పీజీ పరీక్షలు నిర్వహించలేరా అని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.
ఆన్లైన్లో డిగ్రీ,పీజీ పరీక్షలు నిర్వహించలేరా అని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. కోవిడ్ వైరస్ వ్యాప్తి కారణంగా హాస్టల్స్ మూసి ఉన్నందున పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడతారని, చివరి సెమిస్టర్ పరీక్షలన్నీ ఆన్లైన్లో నిర్వహించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
పిటిషనర్ వాదనపై స్పందించిన న్యాయస్థానం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించగలరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సాంకేతికతను ఉపయోగించుకుని ఇంజనీరింగ్ కోర్సులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. అలాగే సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్గా పరిగణిస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయస్థానం ప్రశ్నలకు స్పందించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. ప్రభుత్వాన్ని అడిగి చెప్తానని కోర్టుకు విన్నవించారు. దీంతో విచారణ ఈనెల 15కు వాయిదా వేసింది.
మరోవైపు కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన వివిధ డిగ్రీ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఉస్మానియా వర్సిటీ రెడీ అవుతోంది. ఈనెల 22 నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు మొదలవుతాయి. అదేవిధంగా ఈనెల 15 నుంచి ఇంజనీరింగ్, బీసీఏ, బీఈడీ, బీఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించేందుకు స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.