చరిత్రలో లేదు.! ఎన్నికలకు మంత్రులు, ఉద్యోగ సంఘాలు సహకరించరా.? గవర్నర్ జోక్యం చేసుకోవాలి: యనమల
ఆంధ్రప్రదేశ్లో పరిణామాలపై గవర్నర్ ఉపేక్షించరాదని, తక్షణమే రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు..
ఆంధ్రప్రదేశ్లో పరిణామాలపై ఉపేక్షించరాదని, తక్షణమే రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఆర్టికల్ 243 ఏ ప్రకారం ఎన్నికల నిర్వహణ అధికారం ఎన్నికల సంఘానిదేనని ఆయన చెప్పారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణ కు కావాల్సిన ఉద్యోగులను కేటాయించేలా చూడాల్సింది గవర్నరే అని యనమల అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(3) చెబుతోంది ఇదేనన్నారు యనమల. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఆర్టికల్ 356ను అట్రాక్ట్ చేసేలా ఉన్నాయని, ఎన్నికల నిర్వహణకు సహకరించేది లేదని మంత్రులు చెప్పడం దేశ చరిత్రలో లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మద్యం షాపుల నిర్వహణకు లేని అభ్యంతరాలు, పంచాయితీ ఎన్నికలకు ఉంటాయా..అని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ ప్రభావం ఉందని 2022 జూన్ దాకా స్థానిక ఎన్నికలు జరపరా అని ఆయన అడిగారు. వైసీపీ ప్రభుత్వ రాజ్యాంగ ధ్వంసం(కానిస్టిట్యూషన్ బ్రేక్ డౌన్)ను అడ్డుకోవాలని ఆయన గవర్నర్ ను కోరారు. ఎన్నికలకు సహకరించమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం ఏ రాష్ట్రంలోనూ చూడలేదన్న యనమల, శాంతియుతంగా పంచాయితీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు విన్నవించారు.